మరో మూడు రోజుల్లో క్రికెట్ పండగ మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాది ట్రోఫీని ముద్దాడాలని సన్రైజర్స్ హైదరాబాద్ కసిగా బరిలోకి దిగుతోంది. జట్టు కూర్పుపై కసరత్తులు మొదలుపెట్టింది. ఆటగాళ్ల కఠోర సాధన చేస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్లతో సన్నద్ధమవుతున్నారు.
అయితే ఎస్ఆర్హెచ్కు భారీ షాక్ తగిలింది. నయా ఆల్రౌండర్ వానిందు హసరంగ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ శ్రీలంక ఆల్రౌండర్ ఏప్రిల్ 5వ తేదీ వరకు జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్ నేపథ్యంలో లీగ్కు కొన్ని రోజులు దూరంకానున్నాడు.

గతేడాది ఆగస్టులోనే హసరంగ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చాడు. కానీ ఏమైందో తెలియదు, మనసు మార్చుకుని తన రిటైర్మెంట్ను వెనక్కితీసుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్కు హసరంగను శ్రీలంక బోర్డు ఎంపిక చేసింది. మార్చి 22 నుంచి బంగ్లా-లంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టెస్టు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3వరకు కొనసాగుతుంది.
మరోవైపు ఆ లోపు సన్రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్లు ఆడనుంది. మార్చి 23న కోల్కతా నైట్ రైడర్స్, మార్చి 27న ముంబై ఇండియన్స్, మార్చి 31 గుజరాత్ టైటాన్స్తో ఎస్ఆర్హెచ్ పోటీపడనుంది. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ ఉంది. టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే హసరంగ హైదరాబాద్తో చేరినా పనిభారం దృష్ట్యా అతడు సీఎస్కే పోరుకు కూడా అందుబాటులో ఉండటం కష్టమే.
బంతి, బ్యాటుతో మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న హసరంగ జట్టుకు దూరమవ్వడం ఎస్ఆర్హెచ్కు ప్రతికూలాంశమే. ఆర్సీబీ వదులుకోవడంతో వేలానికి వచ్చిన హసరంగ కోసం సన్రైజర్స్ రూ.1.50 కోట్లు ఖర్చు పెట్టింది. భారీ డిమాండ్ ఉన్న అతడిని హైదరాబాద్ జాక్పాట్తో తక్కువ ధరకే సొంతం చేసుకుంది. కానీ కీలక మ్యాచ్లకు అతడు దూరమవ్వడం జట్టుకు ఎదురుదెబ్బే.
సన్రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ట్రేడ్), అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్విర్సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వానిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.