మరో 10 రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ మెగా లీగ్లో ప్రతి జట్టూ ఫేవరేటే. ఏ టీమ్ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. అయితే ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్ తగలనుంది. విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలి రెండు మ్యాచ్లకు దూరం కానున్నాడు. అంతేగాక మరికొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలూ ఉన్నాయి.
డిసెంబర్ నుంచి సూర్యకుమార్ ఆటకు దూరమయ్యాడు. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో ఇబ్బంది పడిన అతను జర్మనీలో ఈ ఏడాది ప్రారంభంలో సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత మెరుగ్గా కోలుకున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించడం కోసం తీవ్రంగా శ్రమించాడు. కానీ ఎన్సీఏ నుంచి సూర్యకుమార్కు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.

''సూర్యకుమార్ కోలుకుంటున్నాడు. ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కానీ సూర్యకు బీసీసీఐ వైద్యసిబ్బంది, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో జరగనున్న తొలి రెండు మ్యాచ్లకు అతను అందుబాటులో ఉంటాడనే విషయంపై స్పష్టత లేదు. అయితే ముంబై తొలి మ్యాచ్కు ఇంకా 12 రోజుల సమయం ఉంది. ఈలోపు సూర్య ఫిట్నెస్ నిరూపించుకునే అవకాశం కూడా ఉంది'' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై తమ రెండో మ్యాచ్లో ఉప్పల్ వేదికగా మార్చి 27న సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. అయితే బ్యాటింగ్కు అనుకూలించే ఉప్పల్ మైదానంలో సూర్యకుమార్ బరిలోకి దిగకపోతే అది ఎస్ఆర్హెచ్కు సానుకూలాంశమే అని సన్రైజర్స్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, మార్చి 22న జరగనున్న ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్లపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. హార్దిక్ పాండ్య సారథ్యంలో రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉంటుందనే ఉత్కంఠ మొదలైంది. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ బాధ్యతలను ముంబై ఫ్రాంచైజీ అందించిన విషయం తెలిసిందే.