మరికొన్ని గంటల్లో ఐపీఎల్-2024 వేలం ప్రారంభం కానుంది. తొలిసారి భారత్ వెలుపల వేలాన్ని నిర్వహించనున్నారు. దుబాయ్ వేదికగా ఈ మినీ వేలం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. మల్లిక సాగర్ ఆక్షనీర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో తొలిసారి మహిళ ఆక్షనీర్గా పాల్గొనడడం ఈ సారి ప్రత్యేకంగా నిలుస్తుంది.
అయితే వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. బ్యాట్-బాల్ మధ్య పోటీని పెంచడానికి ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లలను అనుమతించనున్నారు. ఈ కొత్త రూల్ను ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేశారు. ఈ నిబంధన బౌలర్లకు కలిసొస్తుందని పేసర్ జయదేవ్ ఉనద్కత్ అభిప్రాయపడ్డాడు.

''ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు బౌలర్లుకు ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో బౌలర్ ఒక బౌన్సర్ వేస్తే తర్వాత మరో బౌన్సర్ రాదని ధీమాతో బ్యాటింగ్ చేసేవారు. కానీ ఈ రూల్తో బ్యాటర్లకు ఆ ఛాన్స్ ఉండదు. బౌన్సర్లు సమర్థవంతంగా ఎదుర్కోడానికి ఇక బ్యాటర్లు మరింత కృషి చేయాలి. అలాగే డెత్ ఓవర్లలో ఇది బౌలర్లకు ఉపయోగపడుతుంది. ఈ రూల్ బౌలర్ల అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని చేర్చినట్టుగా ఉంటుంది'' అని ఉనద్కత్ అన్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూల్ ప్రకారం తుదిజట్టుతో పాటు నలుగురు సబ్స్టిట్యూట్ ప్లేయర్లను టాస్ టైమ్కే ప్రకటించాల్సి ఉంటుంది. ఆ నలుగురిలో ఎవరినైనా జట్టులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ రూల్తో ఆల్రౌండర్ల ప్రాధాన్యత తగ్గుతుందని విమర్శలు వచ్చాయి. గత సీజన్లో వెంకటేశ్ అయ్యర్, విజయ్ శంకర్, శివమ దూబే వంటి ప్లేయర్లకు తమ జట్లకు ఆల్రౌండర్గా కాకుండా బ్యాటర్లగానే ఎక్కువగా ఆడారు.
కాగా, ఐపీఎల్ 2024 వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది.