వచ్చే ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలన్నీ రెడీ అవుతున్నాయి. అదే సమయంలో ఈ నెల చివర్లో జరిగే మినీ వేలంలో కీలకమైన ప్లేయర్లను తమ టీంలో చేర్చుకోవాలని కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు ప్లేయర్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు తెగ పోటీ పడతాయని టీమిండియా వెటరన్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ కీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ జోస్యం చెప్పాడు.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్.. ఇద్దరి కోసం అన్ని ఫ్రాంచైజీలు గట్టిగా ప్రయత్నిస్తాయని అశ్విన్ అన్నాడు. అదే సమయంలో యాషెస్ సిరీస్, టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ దృష్ట్యా వీళ్లిద్దరూ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయని తెలిపాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ గతంలో కూడా ఇలాంటి కారణాల వల్లే ఐపీఎల్కు దూరంగానే ఉన్నారని గుర్తుచేశాడు.

'మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఇద్దరూ ఫ్రెష్ ప్లేయర్లు. రచిన్ రవీంద్ర, గెరాల్డ్ కోట్జీ వంటి మిగతా ప్లేయర్లు ఉన్నా కూడా.. కమిన్స్, స్టార్క్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే యాషెస్ సిరీస్ వస్తుంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కూడా ఉంది. కాబట్టి కమిన్స్, స్టార్క్ ఇద్దరూ ఐపీఎల్కు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది' అని అశ్విన్ వివరించాడు.
వీళ్లిద్దరూ ఇలా గతంలో కూడా ఐపీఎల్కు దూరంగా ఉన్న విషయాన్ని అశ్విన్ గుర్తుచేశాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ హీరో ట్రావిస్ హెడ్ కూడా ఈ ఐపీఎల్ వేలంలో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఇంత మంచి ఫామ్లో ఉన్నా కూడా హెడ్కు అంత భారీ ధర దొరకడం కష్టమేనని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. 'అతని కోసం అంత భారీగా ఖర్చు పెడతారని నేను అనుకోవడం లేదు. అలా జరిగితే నేను కూడా ఆశ్చర్యపోతా' అని వివరించాడు.