ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. ఇప్పటివరకు ముంబై మూడు మ్యాచ్లు ఆడగా అన్నింట్లోనూ ఓటమిపాలైంది. గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అంతేగాక ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో 277 పరుగులు సమర్పించుకున్న ముంబై ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్స్ ఇచ్చిన జట్టుగా పేలవమైన రికార్డు నమోదుచేసింది.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యను ఈ ఓటములతో పాటు మరో సమస్య వేధిస్తోంది. జట్టులో ఆటగాళ్ల నుంచి హార్దిక్కు ఆశించిన మద్దతు రావట్లేదు. అంతేగాక ప్రేక్షకుల నుంచి తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నాడు. వాటన్నింటిని అధిగమించి జట్టును గెలుపు బాట పట్టించాలని ప్రయత్నిస్తున్నా హార్దిక్కు నిరాశే మిగిలుతోంది. దీంతో రాజస్థాన్ చేతిలో ఓటమి అనంతరం డగౌట్లో హార్దిక్ బాధతో ఒంటరిగా కూర్చున్నాడు.

అయితే తీవ్ర ప్రతికూల పరిస్థితులో ఉన్న హార్దిక్ పాండ్యను టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఓదార్చాడు. హార్దిక్తో ముచ్చటించి రాయుడు ధైర్యం చెప్పాడు. దీనికి సంబంధిచిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఓటమి విజయానికి తొలి మెట్టు అనే అర్థం వచ్చేలా దానికి క్యాప్షన్ రాసుకొచ్చింది. గతంలో ముంబయి ఇండియన్స్కు అంబటి రాయుడు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
కాగా, వేలానికి ముందు గుజరాత్ టైటాన్సు నుంచి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేసుకుంది. అయితే ట్రేడ్కు ముందు కెప్టెన్సీ ఒప్పందంతోనే హార్దిక్ ముంబై గూటికి చేరాడని కథనాలు వచ్చాయి. మరోవైపు రోహిత్ శర్మను బలవంతంగా సారథి బాధ్యతలు నుంచి తప్పించాడని ప్రచారం సాగింది. దీంతో హార్దిక్ను రోహిత్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్టేడియంలో హార్దిక్ను హేళన చేస్తున్నారు.
అంతేగాక ముంబై జట్టులో రెండు గ్రూప్లు ఏర్పడ్డాయని వార్తలు వస్తున్నాయి. రోహిత్ మద్దతుదారులు ఓ వర్గంగా ఏర్పడ్డారని, అందులో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ముంబై ఇండియన్స్ తమ తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. వాంఖడే వేదికగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.