రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక సమరానికి సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో బుధవారం రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. క్వాలిఫయిర్-2కు చేరుకోవాలంటే రేపటి మ్యాచ్లో తప్పక విజయం సాధించాలి. రెండు వారాల క్రితం పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచిన ఆర్సీబీ, ఆ తర్వాత వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
అదే జోరులో రేపటి మ్యాచ్లోనూ రాజస్థాన్ రాయల్స్పై నెగ్గి క్వాలిఫయిర్-2కు చేరుకోవాలని ఆర్సీబీ కసిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు రాజస్థాన్ గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఓటమిచవిచూసింది. ఈ నెలలో జరిగిన అయిదు మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోవడం రాజస్థాన్ను కలవరపెడుతోంది. అయితే ఆర్ఆర్ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. రాజస్థాన్కు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ లైనప్ ఉంది.

దీంతో రేపటి పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తుందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. క్వాలిఫయిర్-2కి ఆర్సీబీ తప్పక దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
''ఆర్సీబీ విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్లు ఆడుతున్న విధానం గొప్పగా ఉంది. సీఎస్కేపై గెలిచిన తీరు ఎంతో బాగుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్కు గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇది ఆ జట్టుకు సానుకూలంగా మారుతుందా ప్రతికూలంగా అవుతుందో తెలియదు. అయితే ఆర్సీబీ జట్టులో ప్రతి ఆటగాడికి తన పాత్రపై స్పష్టత ఉంది. కాబట్టి క్వాలిఫయిర్స్-2కు ఆర్సీబీ వెళ్తుందనుకుంటున్నా'' అని రాయుడు అన్నాడు.
రాయుడు వ్యాఖ్యలతో ఆర్సీబీ మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ ఏకీభవించాడు. బెంగళూరు జట్టు క్వాలిఫయిర్-2కు వెళ్తుందని, ఆ తర్వాత ట్రోఫీని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ కోసం విరాట్ కోహ్లి ప్రారంభం నుంచి ఎంతో శ్రమిస్తున్నాడని, సర్వశక్తులతో పోరాడుతున్నాడని అన్నాడు. ఐపీఎల్లో ఎన్నో ఘనతలు సాధించిన కోహ్లికి ట్రోఫీ అందుకోవడం ఒక్కటే మిగిలుందని, అది ఈ సీజన్లో సంపూర్ణమవుతుందని ఆరోన్ పేర్కొన్నాడు.