MS Dhoni: ఐపీఎల్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. గతేడాది వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఈ ఏడాది వదిలేసింది. హార్దిక్ పాండ్యా కోసం గ్రీన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రేడ్ ద్వారా పంపేసింది. ఈ వార్త విన్న ముంబై ఫ్యాన్స్ చాలా మంది ఆశ్చర్యపోయారు.
అయితే పాండ్యా మళ్లీ ముంబైకి రావడంతో వాళ్ల టెన్షన్ కొంత తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే పాండ్యా ప్రస్తుతం చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ మధ్యలో అతను గాయపడకుండా ఉండి ఉంటే.. భారత జట్టు ట్రోఫీ నెగ్గేదని కూడా కొందరు అంటున్నారు. ముఖ్యంగా రిటైన్, రిలీజ్ లిస్టులు కూడా ఇచ్చేసిన తర్వాత పాండ్యాను ట్రేడ్ చేయడం చాలా మందికి అనుమానాలు తెప్పిస్తోంది.

ఎంతో మంది అభిమానులు ఇవన్నీ అంబానీ లీలలేనని, ఐపీఎల్ అంతా అంబానీల చేతుల్లోనే ఉందని ఆరోపణలు కూడా చేశారు. పాండ్యాను రిటైన్ చేసుకున్నట్లు గుజరాత్ ప్రకటించిన తర్వాత కాసేపటికే ట్రేడింగ్ చేసుకున్నామని ఎలా చెప్తారని నిలదీస్తున్నారు. ఇలా ట్రేడింగ్ గురించి గొడవ జరుగుతుంటే.. మరికొందరు ఫ్యాన్స్ అసలు దీన్ని సీరియస్గానే తీసుకోవడం లేదు.
ముంబై, గుజరాత్ ఈ జట్లన్నీ ఎంత ట్రేడింగులు చేసుకున్నా.. చివరకు ఫైనల్లో రాంచీలో వ్యవసాయం చేసుకునే రైతును ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ జోకులు వేస్తున్నారు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ఆడి, ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ధోనీ కూడా ఫినిషర్గా సత్తా చాటాడు.
దీంతో ఫైనల్ గెలిచిన చెన్నై.. తమ ఖాతాలో మరో ఐపీఎల్ ట్రోఫీ వేసుకుంది. ఇదే విషయాన్ని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఐపీఎల్ జట్లు ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని ప్లాన్లు వేసినా.. చివరకు ఫైనల్లో ఈ రాంచీ రైతును ఢీకొట్టక తప్పదని అంటున్నారు.