ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్కపోరులోనే గెలిచింది. సొంతమైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (83*; 59 బంతుల్లో) టాప్ స్కోరర్. దినేశ్ కార్తీక్ (20*; 8 బంతుల్లో) ఆఖర్లో దూకుడుగా ఆడాడు.
అనంతరం ఛేదనలో కోల్కతా 16.5 ఓవరల్లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. వెంకటేశ్ అయ్యర్ (50; 30 బంతుల్లో), సునిల్ నరైన్ (47; 22 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (39*; 24 బంతుల్లో) విజయంలో కీలకపాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ గురించి విశ్లేషించిన మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కోహ్లి ఆటతీరును విమర్శించాడు. కోహ్లి కీలక పరుగులు సాధించినప్పటికీ స్ట్రైక్రేటు దారుణంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

''నువ్వు నేనూ ఎప్పటికీ శాశ్వతం కాదు అన్నట్లుగా సునిల్ నరైన్ బ్యాటింగ్ చేశాడు. ఆ ఫ్యాషన్తో సిక్సర్లు సాధించాడు. ఛేజింగ్ ప్రారంభం నుంచి ఆ టెంపో కొనసాగించాడు. ప్రతి బౌలర్ బౌన్సర్లు, యార్కర్లు రిపీట్గా వేయాలని ట్రై చేస్తుంటారు. కానీ అలా బౌలింగ్ చేయడంలో విఫలమైతే తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారు. ఆర్సీబీ తొలి ఆరు ఓవర్లలో అదే తప్పు చేసింది. దీంతో ఆర్సీబీ నుంచి నరైన్ మ్యాచ్ను లాగేసుకున్నాడు''

''నరైన్ తరహాలోనే ఫిల్ సాల్ట్ కూడా దూకుడుగా ఆడాడు. తొలి ఓవర్లోనే 18 పరుగులు సాధించాడు. అతడు గొప్పగా ఆడాడు. ఇక కోల్కతా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. అయితే కోహ్లి 83 పరుగులు చేయడానికి 59 బంతులు తీసుకున్నాడు. మరోవైపు ఛేదనలో కోల్కతా 5.5 ఓవర్లలోనే 85 పరుగులు చేసింది. అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు'' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.