వాంఖడే వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో, 5x 4, 5x6), శివమ్ దూబె (66*; 38 బంతుల్లో, 10x4, 2x6) అర్ధశతకాలతో సత్తాచాటారు.
ఆఖర్లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో, 3x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105*; 63 బంతుల్లో, 11x4, 5x6) అజేయ శతక పోరాటం వృథాగా మారింది. తిలక్ వర్మ (31; 20 బంతుల్లో, 5x4) సెకండ్ టాప్ స్కోరర్. పతిరన నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఈ విజయంతో సీఎస్కే నెట్ రన్రేటును మెరుగుపర్చుకుని మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ముంబైపై ఆల్రౌండ్ షోతో చెన్నై గెలిచినప్పటికీ డారిల్ మిచెల్ ఫామ్.. టీమ్ మేనేజ్మెంట్, అభిమానులను కలవరపెడుతోంది. వేలంలో అతని కోసం సీఎస్కే ఏకంగా రూ.14 కోట్లు వెచ్చించింది. వన్డే వరల్డ్ కప్లో విధ్వంసకర ఆటతో డారిల్ మిచెల్ పరుగుల వరద పారించడంతో అతనిపై చెన్నై భారీ అంచనాలు పెట్టుకుంది.
కానీ ఈ సీజన్లో డారిల్ మిచెల్ వరుసగా 22, 24*, 34, 13, 25, 17 పరుగులు చేసి నిరాశపరిచాడు. అంచనాలకు తగ్గట్లుగా ఒక్కసారి కూడా బ్యాటును ఝుళిపించలేకపోయాడు. దాదాపు అన్ని మ్యాచ్ల్లోనూ అతను వన్డే తరహా బ్యాటింగ్ చేశాడు. నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 16వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన మిచెల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే బౌండరీ సాధించాడు. అది కూడా ఆఖరి ఓవర్లో ఔటయ్యే ముందు ఆ ఫోర్ సాధించాడు.
దీంతో మిచెల్పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తున్నాయి. సింగిల్స్ తీయడం కోసం రూ.14 కోట్లు ఇచ్చినట్లు ఉందని ట్రోల్స్ వస్తున్నాయి. అలాగే మిచెల్కు బదులుగా భారత కుర్రాడు సమీర్ రిజ్వీకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని నెట్టింట డిమాండ్స్ వినిపిస్తున్నాయి.