ఐపీఎల్ ఆరంభ వేడుకల కోసం అన్ని జట్ల కెప్టెన్లు అహ్మదాబాద్ చేరుకున్నారు. నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ డ్రోన్ షో ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఐపీఎల్ ట్రోఫీతో కలిసి ఫొటోలు దిగేందుకు, లీగ్ ముందు అందరూ కలిసేందుకు జట్ల కెప్టెన్లు అందరూ అక్కడకు చేరుకున్నారు. కానీ వారిలో ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ లేడు.
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఐపీఎల్ జట్టుతో కలవలేదు. నెదర్లాండ్స్తో వన్డే సిరీస్ ఉన్న కారణంగా వాళ్లు కొన్ని రోజుల తర్వాత ఆయా జట్లతో కలవనున్నారు. అయితే సన్రైజర్స్ తరఫున తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ధోనీ, పాండ్యా, డుప్లెసిస్, ధవన్, సంజూ శాంసన్, డేవిడ్ వార్నర్, నితీష్ రాణా, కేఎల్ రాహుల్తో కలిసి భువీ ఫొటోలు దిగాడు. కానీ వీరిలో రోహిత్ కానీ, ఆ జట్టు తరఫున సూర్యకుమార్ కానీ పాల్గొనలేదు.

ఐపీఎల్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఉండటంతో ఈ ఐపీఎల్ అన్ని మ్యాచుల్లో తను ఆడకూడదని రోహిత్ శర్మ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని మ్యాచుల్లో తను తప్పుకుంటే.. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్సీ వహించే అవకాశం ఉంది. కాబట్టి వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ కెప్టెన్ల మీటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారని అభిమానులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వీళ్లిద్దరూ ఈ కార్యక్రమానికి రాలేదు.
మిగతా జట్ల సారధులంతా ట్రోఫీతో కలిసి ఫొటోలు దిగారు. దీంతో సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు. 'వేర్ ఈజ్ రోహిత్' (రోహిత్ ఎక్కడ?) అనే క్వశ్చన్తో ట్విట్టర్ను హీట్ ఎక్కిస్తున్నారు. చాలా మంది ఇదే విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐదుసార్లు ట్రోఫీ నెగ్గిన ముంబై సారధి ఈ కెప్టెన్ల మీటింగ్కు రాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం.. ట్రోఫీ ముందు ఫొటోలు దిగడానికి కాదు. ట్రోఫీ నెగ్గడానికి మావాడు వస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు.