జైపూర్: ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తన దూకుడును కంటిన్యూ చేస్తోంది. ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలిచిన ఈ టీమ్.. ఇప్పుడు కూడా అదరగొడుతోంది. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ను ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లను ఆడిన గుజరాత్- ఆరింట్లో ఘన విజయాన్ని అందుకుంది. మొత్తం 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది.
శుక్రవారం తన తదుపరి మ్యాచ్ను ఆడబోతోంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ను తలపడబోతోంది. దీనికోసం జట్టు జైపూర్కు చేరుకుంది గుజరాత్ టీమ్. నెట్ ప్రాక్టీస్లో చెమటోడ్చుతోంది. నెట్ ప్రాక్టీస్ నుంచి కాస్త రిలీఫ్ కోసం అన్నట్లు ఆ జట్టు స్టార్ బౌలర్ జైపూర్ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. తన అభిమానులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఈ సీజన్లో కూడా రషీద్ ఖాన్ తనదైన శైలిలో వికెట్ల వేటను కొనసాగిస్తోన్నాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లను ఆడిన ఈ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 3/31. స్టార్ హోదా ఉన్న క్రికెటర్ అయినప్పటికీ ఎలాంటి భేషజాలు లేకుండా తన అభిమానులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ రూపురేఖలను మార్చే ప్లేయర్గా అభివర్ణిస్తోన్నారు.
మొన్నటికి మొన్న అదే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన నవీనుల్ హక్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీతో గొడవ పడటాన్ని ప్రస్తావిస్తోన్నారు. రషీద్ ఖాన్ను చూసి నేర్చుకోవాలంటూ సలహాలు ఇస్తోన్నారు. స్టార్ హోదా ఉన్న ప్లేయర్ అయినప్పటికీ భారతీయుల పట్ల ఎంతో మర్యాదగా, స్నేహపూరకంగా మసలుకుంటోన్నాడని, అతణ్ని చూసి నేర్చుకోవాలంటూ సూచిస్తోన్నారు నెటిజన్స్.