ఐపీఎల్ ఈ వారం కూడా థ్రిల్లింగ్ మ్యాచులతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రపంచంలో ఇదే బెస్ట్ లీగ్ అని ఫ్యాన్స్ ఎందుకు అంటారో మరోసారి చాటిచెప్పింది. ఇప్పుడు మరో కొత్త విషయం ప్రేక్షకులు గమనించారు. గత వారం తమ సొంత మైదానంలో ఆడిన జట్లు విజయాలు నమోదు చేస్తే.. ఈ వారం సొంత మైదానంలో ఆడిన ఏ జట్టూ విజయం సాధించలేదు.
లక్నో సూపర్ జెయింట్స్ను తమ సొంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదుర్కొంది. కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్వెల్ చెలరేగడంతో ఆర్సీబీ భారీ స్కోరు కూడా చేసింది. కానీ స్టొయినిస్, పూరన్ రెచ్చిపోవడంతో ఈ భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. ఇలా సొంత మైదానంలో ఆర్సీబీ ఓటమితో వారం మొదలైంది.

ఆ తర్వాత ఇప్పటి వరకు సీజన్లో గెలుపెరగని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ జరిగింది ఢిల్లీలో. దీంతో డీసీనే ఈ మ్యాచ్లో ఫేవరెట్ అని అంతా అనుకున్నారు. కానీ ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ముంబైకి తొలి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ వార్నర్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. సొంత మైదానంలో ఆడిన ఢిల్లీనే ఓడిపోయింది.
చెపాక్లో చెన్నైని ఓడించడం చాలా కష్టం. ఐపీఎల్ను ఫాలో అవుతున్న అందరికీ ఈ విషయం చాలా బాగా తెలుసు. కానీ రాజస్థాన్ రాయల్స్ అదే చేసి చూపించింది. జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్ ఈ మ్యాచ్లో చక్కని ఇన్నింగ్స్లు ఆడారు. చెన్నై బ్యాటర్లు కూడా అద్భుతంగా పోరాడారు. అయినా సరే రాజస్థాన్ ఓటమి ఒప్పుకోలేదు. చివరి ఓవర్లో ధోనీ, జడేజా క్రీజులో ఉన్నా కూడా తమ సూపర్ బౌలింగ్తో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
ఈ సీజన్లో బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్న జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. శిఖర్ ధవన్ నేతృత్వంలోని ఈ టీం కూడా మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్, గుజరాత్ జట్లు తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విజయం గుజరాత్నే వరించింది. చివర్లో రాహుల్ తెవాటియా తన సూపర్ బ్యాటింగ్తో గుజరాత్ టైటాన్స్కు విజయాన్ని అందించాడు.
ఇక తాజాగా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ను సన్రైజర్స్ చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ టీం.. హ్యారీ బ్రూక్, కెప్టెన్ మార్క్రమ్ చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా కూడా చివర్లో తమ అనుభవం మొత్తాన్ని రంగరించి పరుగులు కట్టడి చేశారు. దీంతో సన్రైజర్స్ ఈ మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది ఈ సీజన్లో సన్రైజర్స్కు వరుసగా రెండో విజయం కావడం విశేషం.
ఇలా ఇప్పటి వరకు ఈ వారంలో ఐపీఎల్లో జరిగిన మ్యాచులు అన్నింటిలో విజిటింగ్ టీమ్సే విజయాలు సాధించాయి. మరి వీకెండ్స్లో జరిగే మ్యాచుల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయో లేదో చూడాలి. ఇప్పటి వరకైతే ఈ వారం ఐపీఎల్ను ఆతిథ్య జట్ల కన్నా కూడా విజిటింగ్ టీమ్స్ డామినేట్ చేశాయని చెప్పొచ్చు.