ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుస ఓటములతో విమర్శలపాలు అవుతోంది. డేవిడ్ వార్నర్ సారధ్యంలో ఆడుతున్న ఢిల్లీ ఒక్క మ్యాచ్లో కూడా ధాటిగా ఆడలేదు. ముఖ్యంగా కెప్టెన్ వార్నర్ తన జిడ్డు బ్యాటింగ్తో అభిమానులకు మరింత తలనొప్పి తీసుకొచ్చాడు. తాజాగా బర్సాపరా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఢిల్లీ ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్కు అదిరే ఆరంభం లభించింది. యశస్వి జైస్వాల్ 31 బంతుల్లో 60 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ కూడా 51 బంతుల్లో 79 రన్స్ చేశాడు. ఆ తర్వాత హెట్మెయర్ కూడా ధాటిగా ఆడటంతో రాజస్థాన్ 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఏమాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో ఢిల్లీ నడ్డి విరిచాడు.

ఆ తర్వాత లలిత్ యాదవ్, వార్నర్ జోడీ 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 65 పరుగులు చేసి అవుటయ్యాడు. మిగతా బ్యాటర్లు ఆడేందుకు ఎక్కువ బంతులు మిగల్లేదు. వాళ్లు వచ్చీ రాగానే ధనాధన్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టారు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఎత్తి చూపాడు.
'ఎవరైనా డేవిడ్ వార్నర్ దగ్గరకు వెళ్లి.. అయితే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చెయ్యి లేదంటే ఐపీఎల్ ఆడకు అని చెప్పేయాలి. జైస్వాల్ అలాగే ఆడుతున్నాడు. ఇలా వార్నర్ హాఫ్ సెంచరీ చేయడం కన్నా 30 పరుగులకే అవుటైపోయి ఉంటే బాగుండేది. ఆ తర్వాత వచ్చే రావ్మెన్ పావెల్, ఇషాన్ పోరెల్ ఆడేందుకు బంతులైనా మిగిలేవి. వాళ్లు బిగ్ హిట్టర్లు కూడా. కానీ వాళ్లు ఆడేందుకు బంతుల్లేవు' అని సెహ్వాగ్ విమర్శించాడు. ఢిల్లీ ఓడిన మూడు మ్యాచుల్లో వార్నర్ జిడ్డు బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.