న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ చేరాలంటే- గెలిచి తీరాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. సన్రైజర్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంకా ఓ మ్యాచ్ మిగిలేవున్న నేపథ్యంలో- ఇదే దూకుడును చూపించగలిగితే ప్లేఆఫ్స్ చేరుకోవడం లాంఛనప్రాయమే.
గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే ఆర్సీబీ టార్గెట్ను ఛేదించింది. 19.4 ఓవర్లల్లో 187 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే నష్టపోయింది. ఆర్సీబీ బ్యాటింగ్ మిషన్ విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయాడు. సెంచరీతో మెరిశాడు.

అతని మెరుపు ఇన్నింగ్ పట్ల ఆస్ట్రేలియా మాజీ కేప్టెన్, ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. కోహ్లీని ఆకాశినికెత్తేశాడు. సమకాలీన క్రికెట్లో అతణ్ని మించిన ప్లేయర్ మరొకరు కనిపించట్లేదని వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లల్లో దీన్ని ది బెస్ట్గా అభివర్ణించాడు. గత సీజన్లల్లో విఫలమైన కోహ్లీ ఆ గడ్డు రోజులను అధిగమించాడని వ్యాఖ్యానించాడు.
ఢిల్లీ కేపిటల్స్- రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో మాట్లాడానని, తిరిగి ఫామ్లో రావడానికి చేసిన ప్రయత్నాలను వివరించాడని గుర్తు చేశాడు. చీకటి రోజులను అధిగమించి మళ్లీ వెలుగులోకి వచ్చినట్లుగా ఉందని కోహ్లీ చెప్పాడని వివరించాడు. టీమిండియాలో సుదీర్ఘకాలం పాటు ఆడే శక్తిసామర్థ్యాలు అతనికి ఉన్నాయని, జట్టు సాధించే విజయాల్లో కోహ్లీ కాంట్రిబ్యూషన్ తప్పకుండా ఉంటుందని పేర్కొన్నాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో కోహ్లీదే కీలక పాత్ర అవుతుందని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు డబ్ల్యూటీసీ ఫైనల్స్లో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. 2021 నాటి డబ్ల్యూటీసీ ఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది టీమిండియా. ఈ సారి మళ్లీ ఫైనల్స్కు చేరింది.