హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో చెలరేగింది. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ను నిర్దేశించినప్పటికీ- అలవోకగా ఛేదించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంకా ఓ మ్యాచ్ మిగిలేవున్న నేపథ్యంలో- ఇదే దూకుడును చూపించగలిగితే ప్లేఆఫ్స్ చేరుకోవడం లాంఛనప్రాయమే.
గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్రైజర్స్తో తలపడిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ నిర్దేశించిన 186 పరుగులు భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు ఈజీగా కొట్టి అవతల పడేశారు. 19.2 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లను చీల్చి చెండాడారు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. నాలుగు భారీ సిక్సర్లు, డజను ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 47 బంతుల్లో 71 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ విశ్వరూపం ముందు- సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్లో నమోదైన సెంచరీ వెలవెలబోయింది. హెన్రిచ్ క్లాసెన్- 51 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో చేసిన 104 పరుగులను జనం మరిచిపోయారు.
ఒకే ఐపీఎల్ మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదు కావడం ఇది మూడోసారి. చివరి రెండు సెంచరీల వార్ సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యే యుద్ధం నడిచింది. 2016లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో అప్పటి గుజరాత్ లయన్స్పై ఆర్సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ- ఏబీ డివిలియర్స్ ఈ రేర్ ఫీట్ సాధించారు. కోహ్లీ- 109, ఏబీడీ- 129 పరుగులు చేశారు.
2019 ఐపీఎల్ సీజన్లో మళ్లీ అలాంటి యుద్ధమే సాగింది. ఇదే ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్-జానీ బెయిర్స్టో సెంచరీలతో చెలరేగారు. ఏడు సిక్సర్లు 12 ఫోర్లతో జానీ బెయిర్స్టో-114 పరుగులు చేశాడు. అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో డేవిడ్ వార్నర్ 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సన్రైజర్స్ నిర్దేశించిన 231 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించలేకపోయింది. 113 పరుగులకే కుప్పకూలింది.
2019 తరువాత ఒకే మ్యాచ్లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీ కొట్టడం ఇదే తొలిసారి. అదే ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ను ఓడించడం ద్వారా అప్పటి పరాజయానికి ఆర్సీబీ ఇప్పుడు ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టయింది. ఈ విజయంతో ఆర్సీబీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. ఎల్లుండి తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. అందులో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.