ముంబై: ఐపీఎల్ 2023.. రసవత్తరంగా సాగుతోంది. కొన్ని అనూహ్య విజయాలు నమోదవుతున్నాయి. గత సీజన్ ఛాంపియన్.. గుజరాత్ టైటాన్స్.. తన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూనే వస్తోంది. ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో లోకల్ టీమ్ ఢిల్లీ కేపిటల్స్ను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బౌలింగ్లో, ఆ తరువాత బ్యాటింగ్లో చెలరేగింది. మ్యాచ్పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఇవ్వాళ మరో హైఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. గువాహటిలోని బర్సాపారా స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు ఈ పోరు మొదలవుతుంది. తాము ఆడిన తొలి మ్యాచ్లో గెలిచిన జట్లే ఈ రెండు కూడా. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో, పంజాబ్ కింగ్స్ అయిదో స్థానంలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్కు సంజు శాంసన్, పంజాబ్ కింగ్స్కు శిఖర్ ధావన్ సారథ్య బాధ్యతలను వహిస్తోన్నారు.

దక్షిణాఫ్రికాకు చెందిన స్పీడ్స్టర్ కగిసొ రబడ జట్టుకు అందుబాటులో వచ్చాడు. పంజాబ్ కింగ్స్కు అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇవ్వాళ్టి మ్యాచ్ కోసం అతన్ని తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అతని చేరికతో బౌలింగ్ డిపార్ట్మెంట్ మరింత బలోపేతమౌతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. గత సీజన్లో రబడ.. హయ్యెస్ట్ వికెట్ టేకర్లల్లో ఒకడిగా నిలిచాడు. ఆడిన 13 మ్యాచ్లల్లో 23 వికెట్లను నేలకూల్చాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 99 వికెట్లను తీసుకున్నాడు. వంద వికెట్ల క్లబ్కు చేరువలో ఉన్నాడు.
పించ్ హిట్టర్ భానుక రాజపక్స, కేప్టెన్ శిఖర్ ధావన్ ఫామ్లో ఉండటం పీబీకేఎస్కు కలిసొస్తోంది. తొలి మ్యాచ్లో కోల్కత నైట్ రైడర్స్పై వీరిద్దరూ దుమ్ము లేపారు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు భానుక. శిఖర్ ధావన్ కూడా చెలరేగాడా మ్యాచ్లో. 29 బంతుల్లోనే 40 పరుగులు బాదాడు. కోల్కత నైట్ రైడర్స్ కూడా ధీటుగా బదులిచ్చినప్పటికీ- వర్షం పడటం వల్ల డీఎల్ఎస్ మెథడ్లో ఓడిపోవాల్సి వచ్చింది.
అటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఢీ అంటే ఢీ అనేలా ఉంది. ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కేప్టెన్ సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్.. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. స్కోర్ బోర్డును 200లను దాటించారు. అదే దూకుడును పంజాబ్ కింగ్స్పైనా కొనసాగించవచ్చు. ఈ రెండు జట్లు కూడా ఊపులో ఉన్న నేపథ్యంలో గువాహటి స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టులో- యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ/మురుగన్ అశ్విన్ ఆడే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్లో- ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రజా, సామ్ కుర్రన్, ఎం షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్, కగిసో రబడ ఆడొచ్చు.