జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్.. వరుస విజయాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడింట్లో విజయం సాధించిన ధోనీ సేన దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ కళ్లెం వేసింది. ఏకంగా 32 పరుగులతో తేడా మట్టి కరిపించింది. సీఎస్కేపై సాధించిన ఈ గెలుపుతో రాజస్థాన్- పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఎనిమిది మ్యాచ్లల్లో అయిదు విజయాలతో టాప్ పొజీషన్లో నిలిచింది.
ఆదివారం ముంబై ఇండియన్స్తో తన తదుపరి మ్యాచ్ను ఆడనుంది రాజస్థాన్. ముంబై వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. తాజా పరాజయంతో చెన్నై సూపర్ కింగ్స్ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్తో సమానమైన పాయింట్లను సాధించినప్పటికీ.. నెట్ రన్రేట్ తక్కువగా ఉండటం వల్ల మూడో స్థానానికి దిగజారింది. తన తదుపరి మ్యాచ్ను ఆదివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్తో ఆడనుంది.

సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 77 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్. జోస్ బట్లర్-27, కేప్టెన్ సంజు శాంసన్-17, షిమ్రాన్ హెట్మెయిర్-8 పరుగులు చేశారు.
లోయర్ ఆర్డర్లో ధృవ్ జురెల్, దేవ్దత్ పడిక్కల్ మెరుపులు మెరిపించారు. 15 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో ధృవ్ 34, 13 బంతుల్లో అయిదు ఫోర్లతో పడిక్కల్ 27 పరుగులు చేశారు. వారిద్దరి దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోరు 200 మార్క్ను దాటుకుంది. చెన్నై బౌలర్లు కలిసికట్టుగా విఫలం అయ్యారు. తుషార్ దేశ్పాండే-2, మహీష్ తీక్షణ-1, రవీంద్ర జడేజా-1 వికెట్లు పడగొట్టారంతే.
అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. చివరి వరకు పోరాడింది గానీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగుల వద్ద నిలిచింది ఆ జట్టు ప్రస్థానం. మిడిలార్డర్లో శివం దుబే-52, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్- 47 పరుగులు చేశారు. మొయిల్ అలీ, రవీంద్ర జడేజా 23 చొప్పున పరుగులు చేశారు గానీ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో విఫలం అయ్యారు.
ఈ మ్యాచ్లో కేప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ రెండుసార్లు తన నిగ్రహాన్ని కోల్పోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 16వ ఓవర్లో ధోనీ తొలిసారిగా తన సహనాన్ని కోల్పోయాడు. బౌలర్ మహీష పాథిరానపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని ఎదుర్కొన్న షిమ్రాన్ హెట్మెయిర్ క్విక్ సింగిల్ తీశాడు. వికెట్ కీపర్ ధోనీ వైపు బంతి వెళ్లిన వెంటనే పరుగు తీశాడు.
వేగంగా రియాక్ట్ అయిన ధోనీ బంతిని అందుకుని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు సంధించాడు. బుల్లెట్గా వికెట్ల వైపు దూసుకెళ్తోన్న బంతిని అనాలోచితంగా అందుకునే ప్రయత్నం చేశాడు బౌలర్ మహీషా పాథిరాన. ఇది కాస్తా ధోనీ ఆగ్రహానికి కారణమైంది. పాథిరానాను చూస్తూ అసహనంగా చేతులు ఊపాడు. ధోనీ ఆగ్రహాన్ని చూసిన ఆ యంగ్ బౌలర్ బిత్తరపోయి, తలపట్టుకున్నాడు.
ఇన్నింగ్ చివరి బంతికీ అలాంటి మిస్టేక్ మరోసారి చోటు చేసుకుంది. చివరి బంతిని ఆడిన దేవదత్ పడిక్కల్ లెగ్ సైడ్ దిశగా బంతిని తరలించాడు. దాన్ని అందుకున్న శివమ్ దూబే సరిగ్గా త్రో చేయలేకపోయాడు. అతను విసిరిన త్రోకు పడిక్కల్ మూడు పరుగులు చేశాడు. దీనితో ధోనీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ఒకే మ్యాచ్లో ఇలా రెండుసార్లు ధోనీ సహనం కోల్పోవడం దాదాపుగా అరుదు.