ఐపీఎల్ ప్రారంభం అవడానికి ముందే ముంబై ఇండియన్స్కు షాక్ తగిలింది. టోర్నీ ఆరంభం కోసం అహ్మదాబాద్ చేరుకున్న ఆయా ఫ్రాంచైజీల కెప్టెన్లు అందరూ ఇక్కడ కలిశారు. ట్రోఫీ ముందు నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు. కానీ వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ మిస్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ నుంచి ఈ ఫొటో షూట్కు ఎవరూ హాజరవలేదు. రోహిత్ లేకపోతే అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ అయినా వస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సూర్య కూడా రాలేదు. దీంతో రోహిత్కు ఏమైందని అంతా టెన్షన్ పడ్డారు.
అయితే రోహిత్కు కొంత అనారోగ్యం చేసిందట. అందుకే అతను ఈ ఫొటో షూట్కు రాలేదని సమాచారం. ఈ విషయాన్ని ఒక ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. సడెన్గా రోహిత్కు నలత చేసిందని, దీంతో అతను ఈ కెప్టెన్ల మీటింగ్కు హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో అతని బదులు వేరే వాళ్లను కూడా ముంబై టీం మేనేజ్మెంట్ పంపకపోవడం గమనార్హం. మరి ఇలా అనారోగ్యం పాలైన రోహిత్.. ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో ఆడతాడా? అని అనుమానాలు తలెత్తాయి. అనారోగ్యం చేస్తే రోహిత్ ఆడలేడు కదా.

ఏప్రిల్ 2వ తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లకూ ఈ సీజన్లో ఇదే మొదటి మ్యాచ్. ఈ టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తారు. ఐపీఎల్లో ఆర్సీబీ, ఎంఐ జట్ల మధ్య మ్యాచ్ అన్నా.. ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ అన్నా ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి హైఓల్టేజ్ మ్యాచ్కు రోహిత్ దూరం అవుతాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎంఐ ఫ్యాన్స్ బీపీ పెరిగిపోతోంది. అయితే అలాంటిదేం లేదని ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
రోహిత్ అనారోగ్యం అంత తీవ్రమైంది కాదని తెలుస్తోంది. అతను త్వరగానే కోలుకుంటాడని, ఆర్సీబీతో మ్యాచ్ సమయానికి పూర్తిగా ఫిట్గా ఉంటాడని సమాచారం. ఈ మ్యాచ్ ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. రోహిత్, విరాట్ ప్రత్యర్థులుగా బరిలో దిగే ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ మే 9వ తేదీన వాంఖడే వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడతాయి.