ఐపీఎల్లో సూపర్ పెర్ఫామెన్స్తో అందరి ప్రశంసలు పొందిన ఫినిషర్ రింకూ సింగ్. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను కొన్ని మరపురాని విజయాలు అందించాడీ కుర్రాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఐపీఎల్లో దొరికిన అద్భుతమైన ఫినిషర్గా గుర్తింపు పొందాడు.
గుజరాత్ మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ పాపులారిటీ ఆకాశాన్నంటింది. కేకేఆర్ ఎప్పుడు ఆడుతున్నా ప్రేక్షకులు స్టేడియం దద్దరిల్లేలా రింకూ పేరును నినదించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఫినిషింగ్ స్కిల్స్ గురించి రింకూ మాట్లాడాడు. అలాగే చెన్నైతో మ్యాచ్ తర్వాత ధోనీ తనకు ఇచ్చిన విలువైన సూచనలు ఏంటో కూడా వెల్లడించాడు.

చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైపై కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో కూడా రింకూ అద్భుతంగా ఆడాడు. దీని గురించే మాట్లాడిన రింకూ.. 'మహీ భాయ్ ఒక బెస్ట్ ఫినిషర్. అందుకే మ్యాచ్ ఎలా ఫినిష్ చేయాలని తనను అడిగా. అప్పుడు ధోనీ నన్ను మెచ్చుకున్నాడు. నా బ్యాటింగ్ చూశానని, చాలా బాగా ఆడుతున్నానని అన్నాడు. అలాగే చివరి ఓవర్లో ఆడేటప్పుడు బౌలర్ ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వు.. నువ్వు మాత్రం స్ట్రెయిట్గా కొట్టడానికి ట్రై చేయ్ అని ధోనీ సలహా ఇచ్చాడు' అని రింకూ వెల్లడించాడు.
ఈ సలహా తను చాలా బాగా ఉపయోగపడిందని రింకూ అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ ఫినిషర్గా చెలరేగిన రింకూ.. 14 మ్యాచుల్లో 59.25 సగటు, 149.52 స్ట్రైక్ రేటుతో ఏకంగా 474 పరుగులు చేశాడు. అంతకుముందు ఏడాది కేవలం ఏడు మ్యాచుల్లో 174 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన అతను.. ఈ ఏడాది ఆకాశమే హద్దుగా చెలరేగాడని చెప్పొచ్చు. రింకూ ఆట చూసిన చాలా మంది అతన్ని సాధ్యమైనంత త్వరగా భారత జట్టులోకి తీసుకోవాలని సలహా ఇస్తున్న సంగతి తెలిసిందే.