ముంబై: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలరాత పెద్దగా మారలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లల్లో రెండింట్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఘన విజయాన్ని సాధించిన ఆర్సీబీ- ఆ దూకుడును కొనసాగించలేకపోయింది. చతికిల పడింది. ఆ తరువాతి రెండు మ్యాచ్లల్లో కోల్కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది.

తన తదుపరి మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ను ఎదుర్కొనబోతోంది ఆర్సీబీ. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరు ఎంఏ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ రెండు జట్లకూ ఈ కీలకమైన గేమ్. తన పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేయడానికి ఆర్సీబీ, ఈ మ్యాచ్లోనైనా గెలిచి ఈ సీజన్లో బోణీ కొట్టాలని ఢిల్లీ కేపిటల్స్ పట్టుదలతో ఉన్నాయి. ఏ జట్టు ఓడినా- మున్ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు.
కాగా- ఈ పరిణామాల మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ.. తన జెర్సీని మార్చివేయనుంది. లేత ఆకుపచ్చ రంగుతో కూడిన జెర్సీని ధరించబోతోంది. ఈ కొత్త జెర్సీతో ఈ నెల 23వ తేదీన మ్యాచ్ ఆడబోతోంది. బెంగళూరు హోమ్ పిచ్పై రాజస్థాన్ రాయల్స్ను ఢీ కొట్టనుంది. గో గ్రీన్ జెర్సీగా దీన్ని ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది.

ప్రతి సంవత్సరం కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు- ఒక మ్యాచ్ను ఇలా గ్రీన్ జెర్సీతో ఆడటం ఆనవాయితీగా వస్తోంది. గత సీజన్లో ఇదే జెర్సీతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఎదుర్కొంది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 67 పరుగుల తేడాతో గెలిచింది. 2011 నుంచి గ్రీన్ జెర్సీని ధరించడాన్ని ఆనవాయితీగా మార్చుకుంది రాయల్ ఛాలెంజర్స్. పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. ఇప్పటివరకు డజను మ్యాచ్లల్లో ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ జెర్సీతో గ్రౌండ్లోకి దిగారు. రెండు మ్యాచ్లల్లో మాత్రమే విజయం సాధించారు.