బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో లోకల్ టీమ్ ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ను ఓడించింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ చేసిన 171 పరుగులను బెంగళూరు టీమ్ అలవోకగా ఛేదించింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ ఆ తరువాత తేరుకుంది. హైదరాబాద్కు చెందిన డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ ఇన్నింగ్కు ప్రాణం పోశాడు. రోహిత్ శర్మ, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లు దారుణంగా విఫలమైన చోట.. దుమ్ము దులిపాడు. కన్నడ గడ్డపై సత్తా చాటాడు.

ఈ క్రమంలో ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే అర్ధసెంచరీని అందుకున్నాడు. 46 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్గా క్రీజ్లో నిలిచాడు తిలక్ వర్మ. ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో మరో యంగ్ ప్లేయర్ నేహాల్ వధేరాతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని జట్టుకు అందించాడు. 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు భారీ సిక్సర్లతో ఎదురుదాడి చేశాడు. టాప్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్-15, లోయర్ ఆర్డర్లో అర్షద్ ఖాన్-15 పరుగులు చేశారు.
తిలక్ వర్మ పిడుగుల్లాంటి షాట్లను అతని కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేశారు. వీఐపీ బాక్స్లో నుంచి మ్యాచ్ చూస్తూ సందడి చేశారు. అతను కొట్టే ప్రతి షాట్కూ చిన్నపిల్లల్లా ఎగిరి గంతులేశారు. ఈ సీజన్లో తిలక్ వర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో అతని కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయమే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ను కలుసుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచీ వారందరూ చిన్నస్వామి స్టేడియంలోనే ఉన్నారు.