బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్, ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ను ముద్దాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించింది. ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ ఆ తరువాత తేరుకుంది. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ ఇన్నింగ్కు ప్రాణం పోశాడు. రోహిత్ శర్మ, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లు దారుణంగా విఫలమైన చోట.. ఆర్సీబీ బౌలింగ్ ను ఎదిరించి.. నాటౌట్గా నిలిచాడు.

ఈ క్రమంలో ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే అర్ధసెంచరీని అందుకున్నాడు. 46 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్గా క్రీజ్లో నిలిచాడు తిలక్ వర్మ. ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో మరో యంగ్ ప్లేయర్ నేహాల్ వధేరాతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని జట్టుకు అందించాడు. 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు భారీ సిక్సర్లతో ఎదురుదాడి చేశాడు. టాప్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్-15, లోయర్ ఆర్డర్లో అర్షద్ ఖాన్-15 పరుగులు చేశారు.
నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్కు నిర్దేశించింది ముంబై ఇండియన్స్. ప్రారంభంలో కట్టుదిట్టంగా నిప్పుల్లాంటి బంతులను సంధించిన ఆర్సీబీ బౌలర్లు- ఆ తరువాత బంతిపై పట్టు కోల్పోవడం కూడా ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించడానికి ప్రధాన కారణమైంది. 9 ఓవర్లల్లో 48 పరుగులకు నాలుగు వికెట్లు పడిన దశ నుంచి 171 పరుగులకు చేరుకుందంటే అది పూర్తిగా ఆర్సీబీ బౌలర్ల వైఫల్యమే.
మ్యాచ్ ఆరంభం కావడానికి ముందే తేలికపాటి వర్షం పడటం, తేమ వల్ల బౌలర్లు బంతిపై పూర్తిగా నియంత్రణ కోల్పోయారు. అది ఏ స్థాయిలో ఉందంటే తొలి మూడు ఓవర్లల్లో కేవలం అయిదు పరుగులు ఇచ్చిన టీ20 స్పెషలిస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. తన కోటా చివరి ఓవర్ లో ఏకంగా అయిదు వైడ్లు వేశాడు. సిరాజ్ వేసిన తొలి బంతి డాట్ కాగా.. రెండో బంతికి ఒక పరుగు లభించింది. మూడో బంతి నుంచి వైడ్లు మొదలయ్యాయి. వరుసగా నా..లుగు వైడ్లు వేశాడు.
ఆ సమయంలో స్ట్రైకింగ్ ఎండ్ లో తిలక్ వర్మ ఉండటం కూడా సిరాజ్పై ఒత్తిడి పడటానికి కారణమైంది. నాలుగో బంతిని తిలక్ వర్మ ఫోర్ గా మిలిచాడు. అది అతనిపై మరింత ఒత్తిడిని తీసుకొచ్చింది. ఫలితంగా అయిదో బంతిని కూడా వైడ్ గా వేశాడు. ఆ తరువాతి బంతిని మళ్లీ బౌండరీ లైన్ దాటించాడు తిలక్. ఈ ఓవర్లో అతను ఏకంగా 11 బంతులను సంధించాల్సి వచ్చిందంటే ఏ స్థాయిలో ఒత్తిడికి గురయ్యాడో అర్థం చేసుకోవచ్చు.