ముంబై: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలరాత పెద్దగా మారలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లల్లో రెండింట్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఘన విజయాన్ని సాధించిన ఆర్సీబీ- ఆ దూకుడును కొనసాగించలేకపోయింది. చతికిల పడింది. ఆ తరువాతి రెండు మ్యాచ్లల్లో కోల్కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది.
తన తదుపరి మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ను ఎదుర్కొనబోతోంది ఆర్సీబీ. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరు ఎంఏ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ రెండు జట్లకూ ఈ కీలకమైన గేమ్. తన పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేయడానికి ఆర్సీబీ, ఈ మ్యాచ్లోనైనా గెలిచి ఈ సీజన్లో బోణీ కొట్టాలని ఢిల్లీ కేపిటల్స్ పట్టుదలతో ఉన్నాయి. ఏ జట్టు ఓడినా- మున్ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు.

ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ కేపిటల్స్.. నాలుగింట్లోనూ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఒక్క పాయింట్ కూడా ఆ జట్టు ఖాతాలో లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై శనివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్ను గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుస ఓటములతో సతమతమౌతోన్న స్థితిలో ఆర్సీబీపై జరిగే మ్యాచ్ కోసం తుదిజట్టులో పెద్ద ఎత్తున మార్పులు చేయనుంది.
ఈ పరిస్థితుల్లో- ఢిల్లీ కేపిటల్స్కు ఊరట కలిగింది. ఆల్ రౌండర్ మిఛెల్ మార్ష్ జట్టుతో కలిశాడు. తన గర్ల్ఫ్రెండ్ గ్రెటా మ్యాక్ను నాలుగు రోజుల కిందటే పెళ్లాడాడు మిఛెల్. దీనికోసం స్వదేశానికి వెళ్లాడు. ఆస్ట్రేలియా నైరుతి ప్రాంతంలోని గ్రేస్టౌన్లో ఈ పెళ్లి జరిగింది. పెళ్లి ఫొటోలను మిఛెల్ మార్ష్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. పెళ్లి కార్యక్రమాలు ముగిసిన వెంటనే భారత్కు తిరుగుముఖం పట్టాడు. జట్టుతో కలిశాడు. ఆర్సీబీతో జరిగే మ్యాచ్కు అతను అందుబాటులోకి వచ్చాడు.