బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్ 16వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభశూరత్వాన్ని ప్రదర్శించింది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తుక్కు రేగ్గొట్టిన ఈ జట్టు- రెండో మ్యాచ్లో చావుదెబ్బతిన్నది. కోల్కత నైట్ రైడర్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్లో ఏకంగా 81 పరుగులతో పరాజయాన్ని చవి చూసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత- నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. 17.04 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది. హోరాహోరి పోరు తప్పదని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. బెంగళూరులో తాను ఆడిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఘన విజయాన్ని సాధించిన ఆర్సీబీ ఇక్కడ మాత్రం దాన్ని కొనసాగించలేకపోయింది.

ఈ మ్యాచ్ తరువాత ఆర్సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గాయపడ్డ రీస్ టోప్లే స్థానంలో మరో ఆల్ రౌండర్ను జట్టులోకి తీసుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన వేన్ పార్నెల్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న విషయాన్ని అటు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ కూడా నిర్ధారించింది.
పెద్దగా ఐపీఎల్ మ్యాచ్లను ఆడిన అనుభవం వేన్ పార్నెల్కు లేదు. ఇప్పటివరకు అతను ఆడింది 26 మ్యాచ్లే. 63 పరుగులు చేశాడు. 26 వికెట్లను పడగొట్టాడు. 2011లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన పార్నెల్.. ఆ తరువాత మూడు సీజన్లలోనే ఆడాడు. 2014 తరువాత ఇక మళ్లీ కనిపించలేదు. మళ్లీ అతను ఐపీఎల్ టోర్నమెంట్లో అడుగు పెట్టబోతోండటం ఇదే తొలిసారి.
గాయం వల్ల రీస్ టోప్లే ఈ సీజన్ మొత్తానికీ దూరమైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ ఆడుతూ అతను కిందపడటంతో భుజానికి దెబ్బ తగిలింది. ఈ సీజన్ నుంచి టోప్లే తప్పుకొన్నట్లు ఆర్సీబీ మేనేజ్మెంట్ తెలిపింది. ఆ వెంటనే- పార్నెల్ను సంప్రదించింది. ఈ రకంగా అతనికి అదృష్టం కలిసొచ్చినట్టయింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ నుంచి ఎన్ఓసీ లభించిన వెంటనే భారత్కు ప్రయాణం కానున్నాడు.
తన దేశం తరఫున వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్లో నిలకడగా రాణిస్తోన్న నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం వేన్ పార్నెల్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. తన తదుపరి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడాల్సి ఉంది ఆర్సీబీకి. ఈ నెల 10వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు షెడ్యూల్ అయిందీ మ్యాచ్. అప్పటికి వేన్ పార్నెల్ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.