ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్యాన్స్కు షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హాజిల్వుడ్ సగం మ్యాచులకు దూరం అవుతాడని తేలిపోయింది. మడమ గాయంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా హాజిల్వుడ్ ఆడలేదు. స్వదేశం వెళ్లిపోయి అక్కడే చికిత్స తీసుకున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ ఆడే రెండు, మూడు మ్యాచులకు కూడా అతను దూరం అవుతాడని అంతా అనుకున్నారు.
అయితే తను ఏప్రిల్ 14న భారత్ చేరుకుంటానని, అప్పటి వరకు ఆస్ట్రేలియాలోనే చికిత్స తీసుకోవాలని హాజిల్వెడ్ చెప్పాడు. అంతేకాదు, భారత్కు రాగానే మైదానంలోకి దిగడం కూడా అతనికి కుదరదు. ఇక్కడ కనీసం మరో వారంపాటు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ సాధించి, బరిలో దిగే వీలుంటుంది. అంటే లీగ్ దశలో ఆర్సీబీ ఆడే 14 మ్యాచుల్లో అతను కనీసం ఏడు మ్యాచులకు మిస్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐపీఎల్ తర్వాత జరిగే యాషెస్ సిరీస్ కోసం రెడీ అయ్యేందుకు.. ఐపీఎల్ను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని హాజిల్వుడ్ అనుకుంటున్నాడు. దీని గురించి మాట్లాడిన అతను.. టీ20లు, టెస్టుల్లో వర్క్లోడ్ చాలా వేరుగా ఉంటుందన్నాడు. టీ20ల్లో 20 బంతులు సరిగా వేస్తే సరిపోతుందని, కానీ టెస్టుల్లో అలాకాదని వివరించాడు. ఈ క్రమంలనే తన రనప్, స్పీడ్ మెరుగు పరుచుకునేందుకు ఐపీఎల్లో ప్రయత్నిస్తానని చెప్పాడు. బరిలో దిగేముందు ఒకటి, రెండు సెషన్లు ఫుల్ స్పీడ్తో చేస్తే ఆడే అవకాశం ఉంటుందన్నాడు.
ఒక పక్క ఇలా జోష్ హాజిల్వుడ్ సగానికి సగం మ్యాచులకు దూరం అవుతుంటే.. మ్యాక్స్వెల్ కూడా ఆర్సీబీ మొదటి మ్యాచ్కు దూరమయ్యేలా ఉన్నాడు. కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని మ్యాక్సీ.. భారత్తో వన్డే సిరీస్లో కూడా ఆడలేదు. ఈ క్రమంలో ఆర్సీబీ ఆడే మొదటి మ్యాచ్లో కూడా అతను ఆడటం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్లో మ్యాక్స్వెల్, బ్రేస్వెల్ ఇద్దరూ చెలరేగారు. దీంతో వీళ్లిద్దరూ తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.