ఐపీఎల్ 2023కి ఘనంగా స్వాగతం పలకాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. దీనిలో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్వెల్, మైకేల్ బ్రేస్వెల్ ఇద్దరూ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ప్రాక్టీస్ గేమ్కు సంబంధించిన స్కోర్ కార్డు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో బ్రేస్వెల్ కేవలం 55 బంతుల్లోనే 105 పరుగులతో అజేయంగా నిలవడం గమనార్హం.
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ విల్ జాక్స్ గాయంతో ఐపీఎల్కు దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో ఆర్సీబీ బాగా ఆలోచించి కివీస్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ను తీసుకుంది. తను కూడా అంత విధ్వంసకారుడినే అని ప్రాక్టీస్ మ్యాచ్లో బ్రేస్వెల్ నిరూపించాడు. శతకంతో అజేయంగా నిలిచిన అతను.. చివర్లో రిటైర్ అయ్యాడు. అంటే అతన్ని ఎవరూ అవుట్ చేయలేకపోయారు అన్నమాట. అతనితోపాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (47), విల్లీ (22 నాటౌట్) కూడా ఆకట్టుకున్నారు.

దీంతో ఫాఫ్ ఎలెవన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. హిమాన్షు నాలుగు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం సూయష్ ఎలెవన్ జట్టు ఛేజింగ్లో చెలరేగింది. ముఖ్యంగా మ్యాక్స్వెల్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో మ్యాక్సీ 46 బంతులు ఎదుర్కొని 78 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. అతనితోపాటు మహిపాల్ లోమ్రోర్ (48), అనూజ్ (32) కూడా ఆకట్టుకున్నారు. దీంతో సూయష్ ఎలెవన్ జట్టు విజయం సాధించింది.
ఇది చూసిన అభిమానులు.. ఆర్సీబీ మ్యాచ్ కోసం మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. బ్రేస్వెల్, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ అందరూ మంచి ఫామ్లో ఉన్నట్లు కనిపించడంతో.. చిన్నస్వామి స్టేడియంలో మ్యాక్సీ స్విచ్ హిట్లు చూసేందుకు తెగ ఆరాటపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పాల్గొనలేదని సమాచారం. ఏదేమైనా ఏప్రిల్ 2న ముంబైతో మ్యాచ్లో ఆర్సీబీ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని మాత్రం అర్థం అవుతోంది.