ఐపీఎల్ ముగిసినా కూడా దానిపై చర్చ ఇంకా చల్లారలేదు. ఈ క్రమంలోనే ఒక్కో టీం వదిలేసే ప్లేయర్లు ఎవరనే చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ విషయంపై మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రముఖ కామెంటేటర్, టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఏడాది కూడా కనీసం ప్లేఆఫ్స్ చేరుకోలేకపోయిన పంజాబ్ కింగ్స్ కఠిన నిర్ణయం తీసుకుంటుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. మినీ వేలంలో ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన శామ్ కర్రాన్ వచ్చే సీజన్లో ఈ జట్టుతో ఉండటం కష్టమని అంటున్నాడీ క్రికెట్ పండితుడు. ఈ ఏడాది పంజాబ్ తరఫున 13 మ్యాచులు ఆడిన అతను 135.96 స్ట్రైక్ రేటుతో 276 పరుగులు చేశాడు.

అయితే అంతకుముందు చెన్నై తరఫున అద్భుతంగా రాణించిన కర్రాన్.. పంజాబ్ తరఫున అంత గొప్పగా ఆడలేదనే చెప్పాలి. మినీ వేలంలో ఇంత భారీ ధర పలకడం కూడా అతనిపై ఒత్తిడి పెంచింది. సెహ్వాగ్, గవాస్కర్ వంటి వారు బహిరంగంగానే అంత భారీ ధరకు కొన్న కర్రాన్.. పంజాబ్ టీంకు ఏం చేశాడని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అతన్ని వచ్చే సీజన్కు వదిలేయాలని పంజాబ్ అనుకుంటోందట.
మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో కర్రాన్పై పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం న్యాయం జరగలేదని చోప్రా అన్నాడు. 'శామ్ కర్రాన్ను భారీ మొత్తానికి కొన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్. మరి అతని ప్రదర్శన ఎలా ఉంది? ఎంత మెచ్చుకున్నా అతని ప్రదర్శనను 50-50 కన్నా ఎక్కువ చెప్పలేం. అతనిపై పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం దక్కలేదు. వచ్చే ఏడాదికి ముందు అతన్ని రిలీజ్ చేసేసినా ఆశ్చర్యం లేదు' అని చోప్రా వివరించాడు.
అదే సమయంలో ఎడం చేతి వాటం పేసర్ అయిన కర్రాన్ను పవర్ప్లేలో ఉపయోగించుకున్న పంజాబ్.. దీని వల్ల కూడా నష్టపోయిందని చోప్రా చెప్పాడు. ఒక పక్క కర్రాన్ బౌలింగ్ చేస్తుంటే మరో ఎండ్ నుంచి అర్షదీప్ బౌలింగ్ చేసినా పెద్దగా ఫలితం లేకపోయిందని అన్నాడు. ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లే కావడంతో బ్యాటర్లు త్వరగా అలవాటు పడిపోయారని, దీంతో అర్షదీప్ కూడా ప్రభావం చూపలేకపోయాడని తెలిపాడు.