ముంబై: ఐపీఎల్ 2023- ఎంత రసవత్తరంగా సాగుతోందో.. అదే స్థాయిలో గాయాలు వేధిస్తోన్నాయి. రీప్లేస్మెంట్స్ లిస్ట్ పెరుగుతూనే ఉంది. దాదాపు అన్ని జట్లల్లోనూ గాయాల బారిన పడ్డ ప్లేయర్లు ఉన్నారు. వారిని రీప్లేస్ చేయడానికి ఆయా ఫ్రాంఛైజీల మేనేజ్మెంట్లన్నీ కొత్త ముఖాలను వెదుక్కుంటోన్నాయి. ఇప్పటివరకు 14 మంది డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్లేయర్లు గాయపడ్డారు. వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటోన్నాయి ఫ్రాంఛైజీలు. దీనికి బ్రేక్స్ పడట్లేదు. ఇదే లిస్ట్లో తాజాగా మరో ప్లేయర్ చేరాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో సందీప్ వారియర్ రీప్లేస్ అయ్యాడు. ఇదే జట్టుకు చెందిన ఝైరే రిచర్డ్సన్ కూడా గాయాల వల్ల టోర్నమెంట్కు దూరం అయ్యాడు. అతని స్థానంలో ఇంకా ఎవ్వర్నీ తీసుకోలేదు ముంబై ఇండియన్స్. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం ఆడట్లేదు. అతనికి బదులుగా సందీప్ శర్మను జట్టులోకి తీసుకుంది ఆ ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్. రాజస్థాన్ రాయల్స్లోనే ఒబెద్ మెక్కే గాయపడ్డాడు. అతనికి రీప్లేస్ ఇంకా దొరకట్లేదు.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కైలే జెమిసన్, ముఖేష్ చౌదరిదీ అదే పరిస్థితి. టోర్నమెంట్ ఆరంభానికి ముందే వారిద్దరూ గాయపడ్డాడు. ఇందులో జెమిసన్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన సిసంద మగాలను జట్టులో స్థానం కల్పించింది సీఎస్కే. ముఖేష్ చౌదరికి రీప్లేస్ ఇంకా దొరకలేదు. గాయం వల్ల అందుబాటులో లేకుండా పోయిన వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోకు బదులుగా మాథ్యూ షార్ట్ను తీసుకుంది పంజాబ్ కింగ్స్.
లక్నో సూపర్ జెయింట్స్లో మోహసిన్ ఖాన్, కోల్కత నైట్ రైడర్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ల స్థానాలు ఇంకా అలాగే ఉన్నాయి. వీరిద్దరూ ఐపీఎల్ 2023 నుంచి రూల్డ్ అవుట్ అయ్యారు. ఢిల్లీ కేపిటల్స్లో జట్టు ఫుల్ టైమ్ కేప్టెన్ రిషభ్ పంత్కు బదులుగా అభిషేక్ పోరెల్ను ఆడిస్తోంది టీమ్ మేనేజ్మెంట్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఏకంగా ముగ్గురు ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. విల్ జాక్స్ స్థానంలో మైఖెల్ బ్రేస్వెల్ను జట్టులోకి తీసుకుంది. జోష్ హేజిల్వుడ్, రజత్ పటిదార్లను ఇంకా రీప్లేస్ చేయాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్లో కేన్ విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసిందా జట్టు ఫ్రాంచైజీ. శ్రీలంక కేప్టెన్ డాసన్ శనకను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్తో రీప్లేస్ చేసిందంటూ మొదట్లో వార్తలొచ్చాయి గానీ.. అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు.
తాజాగా పంజాబ్ కింగ్స్ అన్ క్యాప్డ్ ప్లేయర్ రాజ్ అంగద్ బావను రీప్లేస్ చేసిందా జట్టు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గుర్నూర్ సింగ్ బ్రార్ను జట్టులోకి తీసుకుంది. గత ఏడాదే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు గుర్నూర్. అయిదు మ్యాచ్లు ఆడాడు. పంజాబ్ తరఫున ఆడుతున్నాడీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈ అయిదు మ్యాచ్లల్లో 120.22 స్ట్రైక్ రేట్తో 107 పరుగులు చేశాడు. 3.80 ఎకానమీతో ఏడు వికెట్లను పడగొట్టాడు. 20 లక్షల రూపాయలకు అతనితో కాంటాక్ట్ కుదుర్చుకుంది పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్.