చండీగఢ్: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. 200లకు పైగా టార్గెట్ను అలవోకగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంకా ఏడు బంతులు మిగిలివుండగానే కొట్టిపడేసింది. ముంబై ఇండియన్స్ వరుసగా సాధించిన రెండో గెలుపు ఇది. భారీ లక్ష్యాన్ని ఛేదించిన నేపథ్యంలో- ఆ జట్టు నెట్ రన్రేట్ కూడా అదే స్థాయిలో మెరుగుపడింది.
బుధవారం రాత్రి మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లియామ్ లివింగ్స్టొన్ విధ్వంసం సృష్టించాడు. 42 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. మరో ఎండ్లో జితేష్ శర్మ అదే తరహాలో సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో రెండు సిక్సర్లు అయిదు ఫోర్లతో 49 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

ఫలితంగా పంజాబ్ కింగ్స్ 213 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై- ఈ లక్ష్యాన్ని కొట్టి పడేసింది. 18.5 ఓవర్లల్లోనే 214 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, హైదరాబాదీ తిలక్ వర్మ.. మొహాలీ స్టేడియంలో పరుగుల వరద పారించారు. డకౌట్తో రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ- యంగ్ క్రికెటర్లు విజృంభించి ఆడారు.
వారి బ్యాటింగ్ దూకుడుకు పంజాబ్ కింగ్స్ బౌలర్లందరూ చేతులెత్తేశారు. భారీగా పరుగులను సమర్పించుకున్నారు. రిషి ధవన్, నాథన్ ఎల్లిస్ మినహా మిగిలిన ప్రధాన బౌలర్లందరూ ఒక్కో ఓవర్కు 10కి పైగా పరుగులు ఇచ్చుకున్నారు. 3 ఓవర్లల్లో సామ్ కుర్రన్ 41, 2 ఓవర్లల్లో హర్ప్రీత్ బ్రార్- 21, 3 ఓవర్లల్లో రాహుల్ చాహర్-30 పరుగులను పిండుకున్నారు ముంబై ఇండియన్స్ బ్యాటర్లు.
ముంబై బ్యాటర్ల విజృంభణకు ప్రత్యేకించి- పంజాబ్ కింగ్స్ స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ బలయ్యాడు. 3.5 ఓవర్లల్లో ఏకంగా 66 పరుగులను రాబట్టుకున్నారు ముంబై బ్యాటర్లు. ఈ మ్యాచ్లో అతని ఎకానమి 17.21. ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. మ్యాచ్ మొత్తం మీద 23 బంతులను సంధించగా.. అందులో నాలుగే డాట్ బాల్స్. మిగిలివన్నీ భారీగా పరుగులను ఇచ్చుకున్నవే.
అతను ట్రోలింగ్ మెటీరియల్ అయ్యాడు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కు. ఇదివరకు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో కూడా పంజాబ్ కింగ్స్ 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దాన్ని అందుకోలేకపోయింది ముంబై. ఆ మ్యాచ్లో హీరోగా నిలిచాడు ఇదే అర్ష్దీప్ సింగ్. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లను విరగ్గొట్టాడు. ఈ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకున్నారు ముంబై బ్యాటర్లు. అతని నడ్డి విరగ్గొట్టారు.