చండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో హైఓల్టేజ్ మ్యాచ్లు కంటిన్యూ అవుతోన్నాయి. గురువారం రాత్రి మొహాలీలో పంజాబ్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇలాంటిదే. చివరి బంతి వరకూ ఫ్యాన్స్ను టెన్షన్ పెట్టిన మ్యాచ్ ఇది. చివరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సి ఉండగా.. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ రాహుల్ తెవాతియా- ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్ ఒక్కడే టాప్ స్కోరర్. 24 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో ఈ స్కోర్ చేశాడు. భానుక రాజపక్స-20, జితేష్ శర్మ-25, సామ్ కుర్రన్- 22, షారుక్ ఖాన్-22, ప్రభ్సిమ్రాన్ సింగ్-0, కేప్టెన్ శిఖర్ ధావన్8, రిషి ధావన్-1 పరుగులు చేశారు.

పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. చివరి ఓవర్ వరకూ చెమటోడ్చాల్సి వచ్చింది. చివరి ఓవర్ అయిదో బంతికి గెలుపు రుచి చూసింది. 19.5 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. టైటాన్స్ ఇన్నింగ్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్. ఈ సీజన్లో మరో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 49 బంతుల్లో ఒక సిక్సర్, ఏడు ఫోర్లతో 67 పరుగులు చేశాడు.
వృద్ధిమాన్ సాహా-30, సాయి సుదర్శన్-19, కేప్టెన్ హార్దిక్ పాండ్యా-8 పరుగులు చేశారు. డేవిడ్ మిల్లర్- 17, రాహుల్ తెవాతియా-5 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అర్ష్దీప్ సింగ్, కగిసొ రబడ, హర్ప్రీత్ బ్రార్, సామ్ కుర్రన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ వికెట్తో రబడ ఐపీఎల్లో వంద వికెట్లను తీసుకున్న బౌలర్ల జాబితాలో చేరాడు. 64 మ్యాచ్లలోనే అతను ఈ ఘనతను సాధించడం అతని ప్రత్యేకతను చాటుతోంది.
మ్యాచ్ ఓడినప్పటికీ- పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్కు ఎంటర్టైన్మెంట్కు ఏ లోటూ లేకుండా పోయింది. ఓనర్ ప్రీతి జింతా స్టేడియంలో తళుక్కుమని మెరిశారు. అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆమె స్టేడియం మొత్తం ఓ రౌండ్ వేశారు. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ జెర్సీలను అభిమానులకు అందజేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.