
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చివరి ఐపీఎల్కు రెడీ అవుతున్నాడు. ఇదే తన లాస్ట్ ఐపీఎల్ అని అతను చెప్పలేదు కానీ.. చెపాక్లోనే తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడతానని మాత్రం చెప్పాడీ లెజెండ్. దీంతో ఇదే ధోనీ లాస్ట్ ఐపీఎల్ అని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమే అనుకుంటే.. ధోనీ తన లాస్ట్ ఐపీఎల్లో కూడా రికార్డుల మోత మోగించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూడు రికార్డులు బద్దలవడం మాత్రం గ్యారంటీ అనిపిస్తోంది.
అత్యధిక సిక్సర్లు..
ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లలో ఎంఎస్ ధోనీ ఒకడు. 2008 నుంచి తన మార్కు ధనాధన్ ఇన్నింగ్సులతో చెలరేగుతున్న అతను.. ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరీర్లో 229 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాది, ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న ఆటగాళ్లలో ధోనీ రెండో వాడు మాత్రమే. ఈ సీజన్లో కనుక ధోనీ 21 సిక్సర్లు బాదితే.. 250 ఐపీఎల్ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఏ భారతీయ బ్యాటర్ కూడా ఈ ఘనత సాధించకపోవడం గమనార్హం.
ఇన్ని మ్యాచులా?
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే అది ఎంఎస్ ధోనీనే. టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న అతను ఏకంగా 234 మ్యాచులు ఆడాడు. ఈ సీజన్లో కనుక ధోనీ టీం నాకౌట్స్ చేరితే అతను 250 మ్యాచులు ఆడిన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. ఈ మైలురాయి చేరుకోవడానికి ధోనీ ఇంకా 16 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ సీజన్ కనుక ఫ్యాన్స్ అనుకున్నట్లే సాగితే ధోనీ ఈ రికార్డు కూడా సాధిస్తాడు. ధోనీ తర్వాత అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్గా దినేష్ కార్తీక్ (229) ఉన్నాడు.
అరుదైన క్లబ్లో..
ఫినిషర్గా బరిలో దిగే ధోనీ బ్యాటుతో కూడా ఎన్నోసార్లు చెన్నై సూపర్ కింగ్స్ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ క్రమంలోనే 206 ఇన్నింగ్సుల్లో 4978 పరుగులు చేశాడు. అంటే మరో 22 పరుగులు చేస్తే ఐపీఎల్లో 5 వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ధోనీ కూడా చేరతాడు. అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన ఫుల్టైం వికెట్ కీపర్గా కూడా రికార్డు సృష్టిస్తాడు. అదే కనుక సీజన్ మొత్తంలో 185 పరుగులు చేస్తే.. ఏబి డివిల్లీర్స్ (5162) ను అధిగమిస్తాడు కూడా.