ఐపీఎల్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చిత్తయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరకు విజయం చెన్నైనే వరించింది. ఈ మ్యాచ్లో చివరి ఓవర్ వేసిన బౌలర్ మోహిత్ శర్మ. ఆ ఓవర్ తొలి రెండు బంతులకు అద్భుతమైన యార్కర్లు వేసిన అతను.. చివరి రెండు బంతులు వేసే సమయంలో గాడి తప్పాడు.
అతని బౌలింగ్లో భారీ షాట్లు ఆడేందుకు క్రీజులో ఉన్న శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఇద్దరూ చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో విజయం తమదే అని గుజరాత్ ఆటగాళ్లు అనుకున్నారు. శుభ్మన్ గిల్ వంటి కుర్రాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం కూడా మొదలు పెట్టేశారు. కానీ చివర్లో తలకిందులైంది.

ఇలా చివరి బంతికి మ్యాచ్ ఓడిన తర్వాత మోహిత్ శర్మ చాలా బాధగా కనిపించాడు. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఫీలింగ్స్ను మోహిత్ పంచుకున్నాడు. 'నేను నిద్రపోలేదు. నేను ఏదైనా డిఫరెంట్గా చేసుంటే గెలిచే వాళ్లమేమో? అనే ఆలోచనతో నిద్రపట్టలేదు. అలాంటి బాల్ వేసుంటే బాగుండేదా? లేదా ఇలాంటి బాల్ వేయాల్సిందా? అనే ఆలోచనే సరిపోయింది' అని మోహిత్ చెప్పాడు.
ఇది అంత గొప్ప ఫీలింగ్ కాదన్న అతను.. ఏదో కోల్పోయినట్లు బాధగా ఉందని, కానీ దాన్ని పక్కన పెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. అదే సమయంలో మ్యాచ్లో ఆడే సమయంలో తన గేమ్ ప్లాన్ చాలా స్పష్టంగా వేసుకున్నానని చెప్పాడు. నెట్ ప్రాక్టీస్లో ఇలాంటి పరిస్థితులను బాగా ప్రాక్టీస్ చేశానని, దాంతో ఫైనల్ ఓవర్లో కూడా బాగా బౌలింగ్ చేస్తానని నమ్మానని అన్నాడు.
'నేను ఏం చేయాలనే విషయం మైండ్లో క్లియర్గా నాకు తెలుసు. నెట్స్లో ఇలాంటి పరిస్థితులే నేను బాగా ప్రాక్టీస్ చేసేది. ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న అనుభవం ఉంది. అందుకే అన్ని బాల్స్ యార్కర్లు వేయాలని నిర్ణయించుకున్నా. నా ఇన్స్టింక్ట్ను నమ్ముకున్నా' అని వివరించాడు. ఈ ఓవర్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
కానీ రెండు బంతులు వేసిన తర్వాత డ్రింక్ పంపించిన కోచ్ ఆశిష్ నెహ్రా కొన్ని సూచనలు కూడా పంపాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా కూడా మోహిత్కు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఈ సమయంలో జడేజా తన టెన్షన్ నుంచి బయటకు వచ్చేందుకు సమయం దొరికింది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం అయినప్పుడు.. మోహిత్ బౌలింగ్ గాడి తప్పడంతో జడేజా రెండు బౌండరీలతో చెన్నైకి విజయాన్ని అందించాడు.