హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో చెలరేగింది. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ను నిర్దేశించినప్పటికీ- అలవోకగా ఛేదించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంకా ఓ మ్యాచ్ మిగిలేవున్న నేపథ్యంలో- ఇదే దూకుడును చూపించగలిగితే ప్లేఆఫ్స్ చేరుకోవడం లాంఛనప్రాయమే.
గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్రైజర్స్తో తలపడిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 186 పరుగులు భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు ఈజీగా కొట్టి అవతల పడేశారు. 19.2 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లను చీల్చి చెండాడారు.

ఆర్సీబీ సాధించిన ఈ గెలుపు- ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ కష్టాలను మరింత పెంచినట్టయింది. మంగళవారం నాటి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన తరువాత అంతంతమాత్రంగానే ఉన్న రోహిత్ సేన ప్లేఆఫ్స్ అవకాశాలు- ఆర్సీబీ విజయంతో మరింత సంక్లిష్టంగా తయారయ్యాయి. తన చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది ముంబై. గెలిచినా ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్టే.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్రేట్ -0.128. సన్రైజర్స్పై సాధించిన ఘన విజయంతో ఆర్సీబీ కూడా 14 పాయింట్లతో దానికి సమానంగా నిలిచింది. పైగా మెరుగైన నెట్ రన్రేట్ను అందుకుంది. ఆర్సీబీ నెట్ రన్రేట్ +0.180. ఈ రెండు జట్లు కూడా ఇంకో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఈ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్రైజర్స్తో, ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్తో తలపడాల్సి ఉంది. ముంబై, ఆర్సీబీల్లో గెలిచిన జట్టే ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఈ రెండింట్లో ఏ జట్టు గెలిచినా 16 పాయింట్లతో ముందడుగు వేయగలుగుతాయి. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే భారీ తేడాతో సన్రైజర్స్ను ఓడించాల్సి ఉంటుంది. లేదా- ఆర్సీబీ భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది.
అప్పటికీ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు పెద్దగా ప్రభావితం కావు. ఆర్సీబీ తన చివరి లీగ్లో గుజరాత్ టైటాన్స్లో ఓడిపోతే ముంబై ఇండియన్స్ అవకాశాలు మెరుగుపడతాయి. 12 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ను ఢిల్లీ కేపిటల్స్ ఓడించాల్సి ఉంటుంది. లేకపోతే 14 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్ రేసులో నిల్చుంటుంది. ఢిల్లీ చేతిలో ఓడినా రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.