న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ఇక ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 21వ తేదీన చివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్టామి స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ చివరి లీగ్ షెడ్యూల్ అయింది. ప్లేఆఫ్స్ చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్కు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది.
అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వాంఖెడే స్టేడియంలో మరో మ్యాచ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఇది- ముంబై ఇండియన్స్కు లైఫ్ అండ్ డెత్ గేమ్. ప్లేఆఫ్స్లో నిలవాలంటే సన్రైజర్స్ను ఓడించాల్సి ఉంటుంది.. అది కూడా భారీ తేడాతో. ఈ మ్యాచ్లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుందనే గ్యారంటీ ఏ మాత్రం లేదు. ఎందుకంటే- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి.

మంగళవారం రాత్రి లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో మట్టికరిచింది ముంబై ఇండియన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో- నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ టార్గెట్ను అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయిదు పరుగుల తేడాతో ఓడింది.
ఈ ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయింది ముంబై ఇండియన్స్. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఒక మ్యాచ్ చేతిలో ఉంది. సన్రైజర్స్తో జరిగే ఆ మ్యాచ్లో గెలిస్తే పాయింట్ల సంఖ్య 16కు పెరుగుతుంది. ఓడితే 14 పాయింట్ల వద్దే ముంబై ఇండియన్స్ ప్రస్థానం నిలిచిపోతుంది. ఇతర జట్ల నెట్ రన్రేట్ మీద దాని భవిష్యత్ డిపెండ్ అయి ఉంటుంది.
అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందంజ వేసే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల సంఖ్య 12. చేతిలో ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి. గురువారం సన్రైజర్స్తో ఆదివారం చివరి లీగ్లో గుజరాత్ టైటాన్స్తో ఆర్సీబీ తలపడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. రెండూ ఓడితే రాయల్ ఛాలెంజర్స్ కూడా ప్లేఆఫ్స్కు నేరుగా వెళ్లలేదు.
ఒకటి ఓడి ఇంకోటి గెలిస్తే 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్తో సమానంగా నిలుస్తుంది. నెట్ రన్రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. నెట్ రన్రేట్ మెరుగ్గా ఉన్న జట్టే ముందంజ వేస్తుంది. అదే సమయంలో ఖాతాలో 12 పాయింట్లు, చేతిలో రెండు మ్యాచ్లు ఉన్న పంజాబ్ కింగ్స్ కూడా 14 పాయింట్లను అందుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఒక్క ప్లేఆఫ్ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి.