ఈ ఏడాది ఐపీఎల్ 2023లో అనూహ్యంగా ప్లేఆఫ్స్ చేరిన జట్టు ముంబై ఇండియన్స్. ఈ సీజన్ను ఘోరంగా ఆరంభించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత తమ ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్కు దూసుకొచ్చింది. తమ చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్పై ఈ టీం అదిరిపోయే విజయం సాధించింది.
ఆ తర్వాత జరిగిన మరో వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. దీంతో ముంబై నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంది. ఈ క్రమంలో ముంబై జర్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సీజన్లో ముంబై జట్టు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్ పేసర్లు లేకుండానే బరిలో దిగింది.

దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టమని అంతా అనుకున్నారు. అలా అనుకున్నట్లే ఈ సీజన్లో ఆడిన తొలి 7 మ్యాచుల్లో ముంబై నాలుగింటిలో ఓడిపోయింది. దానికితోడు జోఫ్రా ఆర్చర్ ఆడిన కొద్ది మ్యాచుల్లో తేలిపోయాడు. దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఈ ఏడాది కూడా ముంబై పని అయిపోయిందని ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు.
అంతేకాదు, సీజన్ను అద్భుతంగా ఆరంభించిన ఎడం చేతి వాటం కుర్ర బ్యాటర్ తిలక్ వర్మ కూడా సీజన్ మధ్యలోనే గాయపడ్డాడు. దీంతో చాలా మ్యాచులు మిస్ అయ్యాడు. అయినా సరే ముంబై అద్భుతంగా పుంజుకుంది. ఈ టీం ఆడిన చివరి ఏడు మ్యాచుల్లో సూపర్ బ్యాటింగ్తో ఐదు మ్యాచుల్లో విజయాలు నమోదు చేసింది. అంతేకాదు, రెండు సార్లు 200 పైగా స్కోర్లను ఛేజ్ చేసింది.
ఇదంతా చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్లనే ఇదంతా సాధ్యమైందని, అతనో లెజెండరీ కెప్టెన్ అని మెచ్చుకుంటున్నారు. పాండ్యా బ్రదర్స్, బుమ్రా, ఆర్చర్, పొలార్డ్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా జట్టును ప్లేఆఫ్స్ చేర్చిన ఘనత రోహిత్దే అంటున్నారు. ఏదేమైనా ముంబై జర్నీ మాత్రం చందమామ కథలా ఉందని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.