ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. టాప్-3లో నిలిచిన ముంబై ఇండియన్స్ కూడా ఇంటి దారి పట్టింది. రెండో క్వాలిఫైయర్లో గుజరాత్ చేతిలో ఓడిపోయిన ముంబై ఫైనల్ చేరలేకపోయింది. ఈ క్రమంలో ఈ ఏడాది ముంబై సారధి రోహిత్ శర్మ కెప్టెన్సీ అంత గొప్పగా లేదని మాజీ దిగ్గజం సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
ముంబై సారధి గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడిన మంజ్రేకర్.. 'ట్యాక్టికల్గా చూసుకుంటే ఈ ఐపీఎల్లో చెన్నై, గుజరాత్ టాప్ టీమ్స్ అని చెప్పాలి. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం కాదు. కేవలం మైదానంలోనే కాదు, మైదానం బయట కూడా ముంబై ట్యాక్టిక్స్ అంత గొప్పగా అనిపించలేదు. ముఖ్యంగా సీజన్ ఆరంభంలో కొందరు ప్లేయర్లను ఎందుకు ఆడించారో కూడా తెలియలేదు' అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ఆరంభంలో పెద్దగా రాణించలేదు. ఆడిన తొలి ఏడు మ్యాచుల్లో నాలుగింట ఓడిపోయింది. దీంతో మిగతా జట్లతో పోలిస్తే ప్లేఆఫ్స్ రేసులో బాగా వెనుక బడింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని తర్వాతి ఏడు మ్యాచుల్లో ఐదింట విజయాలు సాధించింది. చివర్లో ఆర్సీబీ ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ చేరుకుంది. ఈ క్రమంలోనే ముంబై వ్యూహాలను తప్పుపట్టాడు.
సీజన్ ఆరంభంలో ముంబై తీసుకున్న కొన్ని నిర్ణయాలను తీసుకోకపోతే బాగుండేదని, ఆ విషయంలో రోహిత్ ఈ సీజన్లో ఫెయిలయ్యాడనే చెప్పాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. 'రోహిత్ బ్యాటింగ్లో విఫలమయ్యాడని నేను ఎక్కువ విమర్శించను. కానీ వ్యూహాల విషయంలో ఈ ఏడాది రోహిత్ తన బెస్ట్ ఇచ్చాడని మాత్రం అనుకోవడం లేదు' అని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రోహిత్ బ్యాటుతో కూడా పెద్దగా రాణించని విషయం తెలిసిందే.
అయితే రోహిత్ తన వ్యూహాల్లో కూడా బాగానే రాణించాడని, సరైన నిర్ణయాలే తీసుకున్నాడని ఆస్ట్రేలియా మాజీ లెెజెండ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ ఐపీఎల్ ఎలిమినేటర్లో లక్నోపై ముంబై అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోహిత్ కెప్టెన్సీ చాలా అండర్ రేటెడ్ అని లెజెండ్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.