ముంబై ఇండియన్స్ జట్టులో అత్యంత పేలవ ఫామ్లో ఉన్న ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. టీమిండియా తరఫున ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరిన అతను.. ఐపీఎల్లో కూడా అదే పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్లో కూడా తేలిపోయాడు. బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
అయితే ఈ మ్యాచ్లో సూర్య పెద్దగా ఆడకపోయినా.. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తదితరులు రాణించడంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అర్ధశతకంతో రాణించాడు. దీంతో రోహిత్ మళ్లీ ఫామ్ అందుకున్నాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అతనికే ఈ మ్యాచ్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది. అయితే ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేసే సమయంలో సూర్యకుమార్ తడబడ్డాడు.

ఒక క్యాచ్ నేలపాలు చేశాడు. మరో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించగా.. అది చేయిజారి అతని మొఖానికి తగిలింది. ఆ బంతి సిక్సర్ వెళ్లగా.. నొప్పితో సూర్య మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయినా సరే బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడీ ముంబై బ్యాటర్. కానీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై తెగ విమర్శలు వచ్చాయి. సూర్య పని అయిపోయిందని కొందరు విమర్శలు చేశారు.
అయితే సూర్యను ముంబై జట్టు మాత్రం అభినందించింది. కంటికి దెబ్బ తగిలినా కూడా బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడని ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ మెచ్చుకుంది. అందుకే అతనికి డ్రెస్సింగ్ రూం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందించామని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.