పాకిస్తాన్లో ఉన్నంత కాలం జైల్లో ఉన్నట్లు భావించానని, కనీసం ఫుడ్ కూడా సరిగా దొరికేది కాదని ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్లో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కామెంటేటర్గా డౌల్ పనిచేశాడు. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా డౌల్ కామెంటరీ చెప్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు పాకిస్తాన్లో ఎదురైన భయంకరమైన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు.
పెషావర్ జల్మీ టీంకు పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే. క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో బాబర్ సెంచరీతో చెలరేగాడు. కానీ అతను 83 పరుగుల నుంచి 100 పరుగులకు చేరుకోవడానికి 14 బంతులు తీసుకున్నాడు. దీన్నే అప్పుడు కామెంటరీ చెప్తున్న డౌల్ ఎత్తి చూపాడు. ఇలా వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడటం ఏమాత్రం కరెక్ట్ కాదని విమర్శించాడు. దీంతో బాబర్ అభిమానులు డౌల్పై మండిపడ్డారు.

'జట్టు గురించి ముందుగా ఆలోచించకుడా.. కేవలం పర్సనల్ మైలురాళ్ల కోసం ఆడుతున్నాడు. ఇంకా భారీ హిట్టర్లు రావలసిన అవసరం ఉంది. అలాంటప్పుడు బౌండరీలు బాదేందుకు చూడాలి. సెంచరీలు గొప్పవే, గణాంకాలు కూడా మంచివే.. కానీ అన్నింటికన్నా ముందు జట్టు ముఖ్యం అవ్వాలి' అని బాబర్కు చురకలేశాడు. దీంతో తన హోటల్ ముందు బాబర్ అభిమానులు కాపు కాశారని డౌల్ గుర్తుచేసుకున్నాడు. ఈ కారణంగా తను హోటల్ నుంచి బయటకు రావడం కూడా మానేయాల్సి వచ్చిందన్నాడు.
పాకిస్తాన్లో బతకడం జైలు జీవితంలా అనిపించిందని డౌల్ వెల్లడించాడు. 'ఏదో జైల్లో ఉన్నట్లు ఫీలయ్యా. బాబర్ ఆజమ్ అభిమానులు నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. దీంతో నేను బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండేది కాదు. కొన్ని రోజులైతే ఏమీ తినకుండా గదిలో ఉండిపోవాల్సి వచ్చేది. మెంటల్గా టార్చర్ అనుభవించా. అయితే ఆ దేవుడి దయ వల్ల ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోగలిగా' అని చెప్పాడు. ఇటీవల టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని కూడా డౌల్ ఇలాగే విమర్శించిన సంగతి తెలిసిందే.