కోల్కత: ఐపీఎల్ 2023- ఎంత రసవత్తరంగా సాగుతోందో.. అదే స్థాయిలో గాయాలు వేధిస్తోన్నాయి. రీప్లేస్మెంట్స్ లిస్ట్ పెరుగుతూనే ఉంది. దాదాపు అన్ని జట్లల్లోనూ గాయాల బారిన పడ్డ ప్లేయర్లు ఉన్నారు. వారిని రీప్లేస్ చేయడానికి ఆయా ఫ్రాంఛైజీల మేనేజ్మెంట్లన్నీ కొత్త ముఖాలను వెదుక్కుంటోన్నాయి. ఇప్పటివరకు 14 మంది డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్లేయర్లు గాయపడ్డారు. వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటోన్నాయి ఫ్రాంఛైజీలు. దీనికి బ్రేక్స్ పడట్లేదు. ఇదే లిస్ట్లో తాజాగా మరో ప్లేయర్ చేరాడు.
కోల్కత నైట్ రైడర్స్ ఆటగాడు షకీబుల్ హసన్ ఈ సీజన్ మొత్తానికీ దూరమైన విషయం తెలిసిందే. షకీబల్ హసన్ ఐపీఎల్ ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. ఆదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ ఆడేందుకు హసన్కు అనుమతి నిరాకరించింది.

తాజాగా షకీబల్ హసన్ స్థానాన్ని కోల్కత నైట్ రైడర్స్ భర్తీ చేసింది. ఇంగ్లాండ్ డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ను జట్టులోకి తీసుకుంది. 2.8 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఐపీఎల్ వేలం పాటలో జేసన్ రాయ్ బేస్ ప్రైజ్ 1.5 కోట్ల రూపాయలు. దానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లించి జేసన్ రాయ్ను జట్టులోకి తీసుకుంది. ఇవ్వాళ కోల్కత ఈడెన్ గార్డెన్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్కు అతను అందుబాటులో ఉండడని, తరువాతి మ్యాచ్ నాటికి భారత్కు వస్తాడని తెలిపింది.
జేసన్ రాయ్ టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్. ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్గా దూకుడుగా ఆడుతుంటాడు. ఐపీఎల్లో మాత్రం పెద్దగా రాణించలేదు. 2017, 2018, 2021 సీజన్లో కనిపించాడు. ఇప్పటివరకు అతను ఆడింది 13 మ్యాచ్లే. 329 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ స్కోర్ 91 పరుగులు. మొత్తంగా 129.01 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ఇప్పుడు ఈ సీజన్లో కోల్కత నైట్ రైడర్స్ తరఫున ఆడబోతోన్నాడు. ఇందులో క్లిక్ అయితే- అతనికి తిరుగు ఉండకపోవచ్చు.
ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో సందీప్ వారియర్ రీప్లేస్ అయ్యాడు. ఇదే జట్టుకు చెందిన ఝైరే రిచర్డ్సన్ కూడా గాయాల వల్ల టోర్నమెంట్కు దూరం అయ్యాడు. అతని స్థానంలో ఇంకా ఎవ్వర్నీ తీసుకోలేదు ముంబై ఇండియన్స్. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం ఆడట్లేదు. అతనికి బదులుగా సందీప్ శర్మను జట్టులోకి తీసుకుంది ఆ ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్. రాజస్థాన్ రాయల్స్లోనే ఒబెద్ మెక్కే గాయపడ్డాడు. అతనికి రీప్లేస్ ఇంకా దొరకట్లేదు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కైలే జెమిసన్, ముఖేష్ చౌదరిదీ అదే పరిస్థితి. టోర్నమెంట్ ఆరంభానికి ముందే వారిద్దరూ గాయపడ్డాడు. ఇందులో జెమిసన్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన సిసంద మగాలను జట్టులో స్థానం కల్పించింది సీఎస్కే. ముఖేష్ చౌదరికి రీప్లేస్ ఇంకా దొరకలేదు. గాయం వల్ల అందుబాటులో లేకుండా పోయిన వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోకు బదులుగా మాథ్యూ షార్ట్ను తీసుకుంది పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఏకంగా ముగ్గురు ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. వారిలో విల్ జాక్స్ స్థానంలో మైఖెల్ బ్రేస్వెల్ను జట్టులోకి తీసుకుంది. జోష్ హేజిల్వుడ్, రజత్ పటిదార్లను ఇంకా రీప్లేస్ చేయాల్సి ఉంది.