ప్రపంచ క్రికెట్ చూసిన అతి గొప్ప కెప్టెన్లలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒకడు. ఎంత ఒత్తిడిలో అయినా సరే చాలా కామ్గా కనిపించే ధోనీ.. తన హయాంలో అన్ని ప్రధాన ఐసీసీ ట్రోఫీలనూ ముద్దాడాడు. ఇంత సక్సెస్ సాధించిన ధోనీకి తన టీం మెంబర్స్తో చాలా మంచి అనుబంధం ఉంది.
అతని కెప్టెన్సీలో ఎంతో మంది ఆటగాళ్లు భారత జట్టులో అరంగేట్రం చేసి సక్సెస్ చవిచూశారు. అలాంటి వారిలో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ఇటీవల ఐపీఎల్లో గాయపడి లీగ్తోపాటు భారత జట్టుకు కూడా కొంత కాలంపాటు దూరమైన రాహుల్.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోనీ సక్సెస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.

'ధోనీ నాకు ఈ విషయం చాలా సార్లు చెప్పాడు. కెప్టెన్గా నీ గట్ ఫీలింగ్ను బలంగా నమ్మాలి. ధోనీ కూడా అదే చేసేవాడు. కెప్టెన్గానే కాకుండా, వ్యక్తిగా కూడా ధోనీ ఇదే నమ్మేవాడు. మనకు ఏదైనా ఒక ఆలోచన వస్తే.. దాన్ని మనం చాలా రకాలుగా క్వశ్చన్ చేస్తాం. ధోనీ మాత్రం అలా చేయడు. ఏదైనా విషయం ఇలా జరుగుతుంది అనుకుంటే.. అదే చేస్తాడు. మరో ఆలోచన చేయడు' అని రాహుల్ వెల్లడించాడు.
తను తీసుకున్న నిర్ణయం వల్ల ఫలితం మంచిగా వచ్చినా, రాకపోయినా ధోనీ మాత్రం ఆ నిర్ణయాన్ని ఎప్పుడూ తప్పుబట్టలేదని తెలిపాడు. 'ఇలా చేయడం ధోనీకి చాలా విషయాల్లో మంచే చేసింది. అందుకే చాలా విషయాల్లో అతను చాలా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో ఎవరికీ అర్థం కాదు కానీ.. అప్పుడు ధోనీ తన గట్ ఫీలింగ్ను నమ్మాడంతే. అందుకే అతనికి అనుగుణంగానే ఫలితాలు కూడా వచ్చేవి' అని చెప్పుకొచ్చాడు.
అలాగే ప్రస్తుతం టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, అతన్ని తాను చాలా మిస్ అవుతానని రాహుల్ చెప్పాడు. ఆటగాళ్లను ధోనీ హ్యాండిల్ చేసే విధానం, వారితో ధోనీ అనుబంధం వేరే లెవెల్లో ఉండేవన్నాడు. ఫలితం ఎలా వచ్చినా సరే.. తన ఫీలింగ్ను నమ్మడమే ధోనీ సక్సెస్ సీక్రెట్ అని రాహుల్ అభిప్రాయపడ్డాడు.