న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ సెకెండ్ హాఫ్.. హోరాహోరీగా సాగుతోంది. ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న కొద్దీ అన్ని జట్లు తెగించి ఆడుతున్నాయి. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాయి. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్లో రాజస్థాన్ రాయల్స్ చెలరేగిన తీరే దీనికి నిదర్శనం. 149 పరుగుల లక్ష్యాన్ని పింక్ టీమ్.. 13.1 ఓవర్లల్లోనే ఊదిపడేసిందంటే ప్రత్యర్థిపై ఆ జట్టు ఎంతగా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు.
కోల్కత నైట్ రైడర్స్ బ్యాటర్లు.. తమ హోమ్ పిచ్పై తడబడ్డారు. రాజస్థాన్ రాయల్స్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో ఘోరంగా విఫలం అయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 42 బంతుల్లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 57 పరుగులు చేశాడు.

22 పరుగులు చేసిన కేప్టెన్ నితీష్ రాణా సహా మరెవరూ సత్తా చాటలేకపోయారు. జేసన్ రాయ్- 10, రహ్మనుల్లా గుర్బాజ్- 18, ఆండ్రీ రస్సెల్స్-10, రింకూసింగ్-16 పరుగులు చేశారు. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. 13.1 ఓవర్లలోనే 151 పరుగులు చేసింది. ఒక్క వికెట్ నష్టానికే లక్ష్యాన్ని అందుకుంది. సుడిగాలి ఇన్నింగ్ను ఆడారు రాజస్థాన్ బ్యాటర్లు.
ప్రత్యేకించి- ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి దుమ్మురేపాడు. 62 బంతుల్లో అయిదు సిక్సర్లు, 12 ఫోర్లతో 98 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కేప్టెన్ సంజు శాంసన్ 48 పరుగులతో అతనికి తనవంతు సహకారాన్ని అందించాడు. ఈ సీజన్లో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్నాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లను ఆడిన జైస్వాల్ 575 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 167.15 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో స్టేడియంలో పరుగుల వరదను పారిస్తోన్నాడీ లెఫ్ట్ హ్యాండర్. 2020లో ఐపీఎల్లో అడుగు పెట్టిన ఈ యంగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ అతి తక్కువ సమయంలో 1,000 పరుగుల ల్యాండ్ మార్క్ను అందుకున్నాడు. 35 మ్యాచ్లల్లో 1,122 పరుగులు చేశాడు.
కోల్కత నైట్ రైడర్స్పై మ్యాచ్లో ఫాస్టెస్ట్ 50ని నమోదు చేశాడు జైస్వాల్. 13 బంతులోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ 13 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇన్నింగ్ను ఆరంభించిన జైస్వాల్.. తొలి ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అక్కడ ఆరంభమైన అతని దూకుడు ఇన్నింగ్ చివరి బంతి వరకూ కొనసాగింది. అతణ్ని అవుట్ చేయలేకపోయారు కోల్కత బౌలర్లు.
టీ20 ఫార్మట్లో అతి తక్కువ బంతుల్లో 50 పరుగులను చేసిన అరుదైన క్రికెటర్ల జాబితాలో చేరాడు జైస్వాల్. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన మూడో బ్యాటర్ అతనే. ఇప్పటివరకు ఈ రికార్డు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ పేరు మీదే ఉంది. వారిద్దరూ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. జైస్వాల్ ఇంకో బంతి ఎక్కువగా తీసుకున్నాడు ఈ రికార్డ్ కోసం. యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, యశస్వి జైస్వాల్.. లెఫ్ట్ హ్యాండర్లే.