బెంగళూరు: కేదార్ జాదవ్. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆల్రౌండర్. ఇంటర్నేషనల్స్ సహా ఐపీఎల్లో జట్టుకు బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచిన ప్లేయర్. కొన్నేళ్లుగా ఫామ్లో ఉండట్లేదు. క్రికెట్కూ దూరం అయ్యాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. మెగా వేలంపాట సందర్భంగా ఐపీఎల్లో కూడా అతణ్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఏ మాత్రం ఆసక్తి చూపలేదు.
కేదార్ జాదవ్ కేరీర్ దాదాపుగా ముగిసినట్టేనని భావించారంతా. ఆ పరిస్థితుల్లో అనూహ్యంగా ఐపీఎల్లో అడుగుపెట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మ్యాచ్లను ఆడబోతోన్నాడు. ఈ శనివారం ఢిల్లీ కేపిటల్స్తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది.

గతంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో మెరిశాడు కేదార్ జాదవ్. ఇప్పటివరకు ఐపీఎల్లో 93 మ్యాచ్లను ఆడాడు. 1196 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక పరుగులు 69. గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికీ దూరమైన డేవిడ్ విల్లే స్థానంలో కేదార్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. అతనిపై నమ్మకంతో జట్టులోకి తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్.
2021 సీజన్లో సన్రైజర్స్ తరఫున ఆడిన తరువాత మళ్లీ ఐపీఎల్లో కనిపించలేదు. ఇప్పుడు తాజాగా ఐపీఎల్లో తన కమ్బ్యాక్పై స్పందించాడు కేదార్ జాదవ్. ఐపీఎల్లో మ్యాచ్లు ఆడే అవకాశం రాకపోవడం వల్ల కామెంటేటర్గా స్థిరపడ్డానని వివరించాడు. ఐపీఎల్ మ్యాచ్ల కోసం మరాఠీలో కామెంటరీ చెబుతోన్నానని వివరించాడు. అలాంటి తనకు ఆర్సీబీ మళ్లీ ఐపీఎల్ ఆడే అవకాశాన్ని కల్పించిందని, జట్టు విజయాల కోసం నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ పెడతానని అన్నాడు.
క్రికెట్తో ఏడాది గ్యాప్ వచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకున్నానని వివరించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 92.5 సగటును అందుకున్నానని, ఆ కారణంతోనే ఆర్సీబీ మేనేజ్మెంట్ తనను జట్టులోకి ఆహ్వానించి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కేదార్ జాదవ్ రాకతో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బలోపేతమౌతుందని, పార్ట్ టైమ్ బౌలర్ కావడం వల్ల అటు బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా లబ్దిపొందుతుందని భావిస్తోంది.