కోల్కత: ఐపీఎల్ 2023లో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఓటమిని చవి చూసింది. 81 పరుగుల తేడాతో కోల్కత నైట్ రైడర్స్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత- నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది.
హోరాహోరి పోరు తప్పదని ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. 17.04 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది రాయల్ ఛాలెంజర్స్. ఈ పరిణామం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. బెంగళూరులో తాను ఆడిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఘన విజయాన్ని సాధించిన ఆర్సీబీ ఆ దూకుడును కోల్కతలో కొనసాగించలేకపోయింది.
ఈ నెల 10వ తేదీన తన తదుపరి మ్యాచ్ను ఆడనుంది ఆర్సీబీ. లక్నో సూపర్ జెయింట్స్ను ఢీ కొట్టనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ మ్యాచ్ కోసం డుప్లెసిస్ సేన కసరత్తు చేస్తోంది. రెండో మ్యాచ్లో చోటు చేసుకున్న వైఫల్యాలపై స్టడీ చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన నేపథ్యంలో లక్నో జెయింట్స్పై జరిగే మ్యాచ్ కోసం తుదిజట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు లేకపోలేదు.

దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటివరకు జట్టుకు అందుబాటులో లేని ఇద్దరు స్టార్ బౌలర్లు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్, శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ జట్టుతో చేరనున్నారు. హసరంగ- ప్రస్తుతం తన దేశం తరఫున ఇంటర్నేషనల్స్ ఆడుతోన్నాడు. ప్రస్తుతం లంక జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఈ టూర్ ముగింపుకొచ్చింది.
శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ శనివారం జరుగనుంది. క్వీన్స్టౌన్లో సాయంత్రం 6:30 గంటలకు మొదలవుతుంది ఈ మ్యాచ్. దీనితో న్యూజిలాండ్లో శ్రీలంక టూర్ ముగుస్తుంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే వనిందు హసరంగ భారత్కు బయలుదేరి రానున్నాడు. నేరుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కలవనున్నాడు.
10వ తేదీ నాటికి అతను జట్టుకు అందుబాటులోకి వస్తాడని ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ కూడా ధృవీకరించాడు. ఇక ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ రాక ఇంకొంత ఆలస్యం కానుంది. ఈ నెల 17వ తేదీన అతను రానున్నట్లు సంజయ్ బంగర్ చెప్పారు. వారిద్దరి రాకతో బౌలింగ్ డిపార్ట్మెంట్ బలోపేతమౌతుందని పేర్కొన్నాడు.