ముంబై: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ మళ్లీ పాత పాటే పాడుతోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లల్లో నాలుగింట్లో ఓడింది. వరుసగా మూడు మ్యాచ్లల్లో విజయఢంకా మోగించిన తరువాత గెలుపుబాట పట్టినట్టే కనిపించినప్పటికీ.. ఆ వెంటనే వరుసగా రెండింట్లో ఓడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఏడో స్థానానికి పరిమితమైంది ప్రస్తుతానికి.
అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియంలో సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్పై జరిగిన మ్యాచ్లో భారీ తేడాతో పరాజయాన్ని చవి చూసింది ముంబై ఇండియన్స్. ఏకంగా 55 పరుగుల తేడాతో మట్టి కరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్లను మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేయగా.. ముంబై ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్లను నష్టపోయి 152 పరుగుల వద్ద చతికిలపడింది.

ఇక తన తదుపరి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్పై ఆడబోతోంది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు వాంఖెడే స్టేడియంలో ఇది షెడ్యూల్ అయింది. ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులోకి రానున్నాడు. నిన్నటి వరకు అతను జట్టుతో లేడు. ఓ చిన్న సర్జరీ చేయించుకోవడానికి బెల్జియం వెళ్లాడు. ఈ శస్త్ర చికిత్స ముగిసింది. జట్టుకు అందుబాటులోకి రానున్నాడు.
19 రోజులుగా ఐపీఎల్కు దూరంగా ఉంటోన్నాడు జోఫ్రా ఆర్చర్. పంజాబ్ కింగ్స్పై మ్యాచ్ తరువాత మళ్లీ గ్రౌండ్లోకి దిగలేదు. అదే అతని చివరి మ్యాచ్. సర్జరీ కోసం బ్రెజిల్ వెళ్లాడు. ఈ 25 నెలల వ్యవధిలో అతనికి జరిగిన ఆరో సర్జరీ ఇది. మైనర్ సర్జరీనే కావడం వల్ల త్వరగా కోలుకున్నాడని, పైగా తదుపరి మ్యాచ్కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నందున అప్పటివరకు వందశాతం ఫిట్నెస్ సాధిస్తాడని మేనేజ్మెంట్ పేర్కొంది.
ఇంగ్లాండ్ తరఫున ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్లో ఆడాల్సి ఉంది జోఫ్రా ఆర్చర్కు. అందుకే గాయాలపరంగా ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించట్లేదు. 2021 ప్రారంభం నుంచీ అతను గాయాలను ఎదుర్కొంటూ వస్తోన్నాడు. సంవత్సరం పాటు మోచేతి గాయంతో సతమతం అయ్యాడు. టీ20 ప్రపంచ కప్, యాషెస్ సిరీస్కూ దూరంగా ఉన్నాడు. ఆ తరువాత వెన్నెముక గాయంతోనూ బాధపడ్డాడు.