ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ కొత్త వసంతంలోకి అడుగు పెడుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ఒక ఎత్తు.. ఇది ఒక ఎత్తు అనే రేంజ్లో దీని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒకసారి ఐపీఎల్లో ఆధిపత్యం చెలాయించిన కెప్టెన్లు ఎవరా? అని కొందరు ఆలోచిస్తున్నారు. ఆ ప్రశ్నకు సూటి సమాధానం ఒకటే.. ఐపీఎల్లో ఆధిపత్యం ఇప్పటి వరకు ఎప్పుడూ భారత కెప్టెన్లదే. అదెలాగో చూద్దాం..
2008లో తొలి ఐపీఎల్ నెగ్గిన షేన్ వార్న్ విదేశీయుడే. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ కూడా ట్రోఫీ నెగ్గాడు. కానీ అత్యధిక సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన కెప్టెన్ మాత్రం మనవాడే. అతనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఒక్క ట్రోఫీ నెగ్గడంలోనే కాదు. దాదాపు అన్ని అంశాల్లో ఐపీఎల్ను భారత కెప్టెన్లే ఏలారు. ఈ లీగ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ ఎవరో తెలుసా? చెన్నై సూపర్ కింగ్స్ 'తల' ఎంఎస్ ధోనీ. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి కెప్టెన్గా ధోనీ 203 సిక్సర్లు బాదాడు.

ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ కూడా ధోనీనే. ఇప్పటి వరకు ఐపీఎల్లో ధోనీ 123 విజయాలు నమోదు చేశాడు. అలాగే ఈ లీగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కెప్టెన్ కేఎల్ రాహుల్. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నప్పుడే అతను 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక లీగ్ హిస్టరీలో అత్యధిక ఫోర్లు బాదిన కెప్టెన్ కూడా మనవాడే. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీతో ప్రయాణిస్తున్న విరాట్ కోహ్లీ.. ఈ క్రమంలో 413 ఫోర్లు బాదాడు. మరే కెప్టెన్ కూడా ఇన్ని బౌండరీలు బాదలేదు.
ఇక, ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు 50 పైగా పరుగులు చేసిన కెప్టెన్ కోహ్లీ. అతను ఈ ఘనత 40 సార్లు సాధించాడు. అలాగే అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ కూడా కోహ్లీనే. ఐపీఎల్లో కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడే ఐదు శతకాలు నమోదు చేశాడు. కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా కోహ్లీనే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారధ్య బాధ్యతలు మోస్తున్నప్పుడే కోహ్లీ 4881 పరుగులు చేశాడు. ఎక్కువ కాలం భారతీయులే ఆయా జట్లకు కెప్టెన్సీ చేయడంతో వారు ఈ రికార్డులు సాధించారని వీటన్నింటినీ కొట్టేయొచ్చు. కానీ ఫలితాలు చూపిస్తే ఏ కెప్టెన్ అయినా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయి కదా.