ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిందీ జట్టు. ఈ టీం ఇంత సక్సెస్ అవడంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ పాత్ర చాలా కీలకం. అతని కెప్టెన్సీ స్టైల్, వ్యూహాలు ఆ జట్టుకు చాలా బాగా కలిసొచ్చాయి. అయితే ఒకసారి ధోనీ కనుక రిటైర్మెంట్ ప్రకటిస్తే చెన్నై పరిస్థితి ఏంటి?
ఇదే ప్రశ్న ఐపీఎల్ అభిమానులను పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి ధోనీ రిటైర్ అయితే చెన్నై జట్టు ఆటతీరు మారిపోతుందని అభిప్రాయపడ్డాడు. తన వ్యాఖ్యలకు బలం చేకూర్చడానికి అతను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు.

గతేడాది ఐపీఎల్ ఆరంభంలో తను చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. ఆ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అతని కెప్టెన్సీలో ఆ జట్టు అత్యంత ఘోరంగా ఆడింది. దీంత సీజన్ మధ్యలో మళ్లీ ధోనీకే పగ్గాలు అప్పగించిందీ ఫ్రాంచైజీ యాజమాన్యం. ఇదే విషయాన్ని టామ్ మూడీ మరోసారి గుర్తుచేశాడు.
'ధోనీ లేకపోతే ఈ జట్టు కచ్చితంగా మారిపోతుంది. ముఖ్యంగా మైదానంలో వీళ్ల ఆట పూర్తిగా ఛేంజ్ అవుతుంది. ధోనీ అదే ఫ్రాంచైజీలో మెంటార్గానో లేదంటే కోచ్గానో ఉంటాడు. కాబట్టి అతని ప్రభావం జట్టుపై ఉంటుంది. గతేడాది జడేజా కెప్టెన్ అయ్యాడు. అప్పుడు ఆ టీం ఫీల్ అంతా మారిపోయింది కదా' అని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్లో కెప్టెన్సీ ఇంపాక్ట్ చాలా ఉంటుందని మూడీ చెప్పాడు. మంచి కెప్టెన్ ఉన్న జట్లే ఎక్కువ సార్లు టాప్-4లో ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదని సూచించాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువసార్లు టాప్-4లో నిలిచి ప్లేఆఫ్స్ చేరిన జట్ల వివరాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ జాబితాలో చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్కతా టాప్-4లో ఉండటం గమనార్హం.