ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇవ్వాళ సన్రైజర్స్ హైదరాబాద్- కోల్కత నైట్ రైడర్స్ తలపడనున్నాయి. కోల్కత ఈడెన్ గార్డెన్స్లో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సన్రైజర్స్ హైదరాబాద్కు ఎయిడెన్ మార్క్రమ్, నైట్రైడర్స్కు నితీష్ రాణా కేప్టెన్లుగా వ్యవహరించనున్నారు. సన్రైజర్స్ కంటే మెరుగైన స్థానంలో ఉంది కేకేఆర్. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ఎప్పట్లాగే ఈ సారి కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాయి. దీని విలువ 6,000 కోట్ల రూపాయల పైమాటే. ఇన్ని కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెడుతోన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలకు దానికి తగ్గట్టుగా ఆదాయ వస్తుందా? ఎలా వస్తుంది? ఏ రూపంలో ఫ్రాంఛైజీలు తాము ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకుంటాయనేది ఆసక్తి కలిగించే విషయమే.

నిజానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ జట్టును కొనుగోలు చేసే ఏ మేనేజ్మెంట్ కూడా నష్టపోదు. పైగా పదింతల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు వేర్వేరు మార్గాల ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇందులో ప్రధాన ప్రాత పోషించేది స్పాన్సరర్లే. మ్యాచ్ ఆడే సమయంలో క్రికెటర్లు ధరించే జెర్సీలు, ట్రైనింగ్ కిట్ల మీద మల్టీనేషనల్ కంపెనీల పేర్లు, వారి బ్రాండ్లను ముద్రించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జిస్తాయి ఫ్రాంఛైజీలు.
ప్రత్యేకించి- జెర్సీల ఛెస్ట్ భాగంలో ముద్రించే బ్రాండ్ల ద్వారా వచ్చే రాబడి ఎక్కువ. జెర్సీ ఛెస్ట్ భాగంలో తమ కంపెనీల పేర్లు, బ్రాండ్లను ముద్రించడానికి కంపెనీలు పోటీ పడుతుంటాయి. అలాగే గ్రౌండ్లో బౌండరీ లైన్ల దగ్గర అమర్చే బోర్డుల ద్వారా ఆదాయం వస్తుంది. మీడియా హక్కుల ద్వారా లభించే ఆదాయం కూడా భారీగా ఉంటుంది. దీన్ని ఫిక్స్డ్ ఇన్కమ్గా చెబుతారు.
మీడియా హక్కుల ద్వారా వచ్చే ఆదాయానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. ఈ రూపంలో అందే రాబడిని సమానంగా పంచి.. అన్ని ఫ్రాంఛైజీలకు పంపించే బాధ్యత బీసీసీఐదే. ఇందులో బీసీసీఐకి కొంత వాటా వెళ్తుంది. టీమ్ సభ్యులు హాజరయ్యే కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఫ్రాంఛైజీలకే వెళ్తుంది. అడ్వర్టయిజ్మెంట్లకు ఇందులో నుంచి మినహాయింపు ఉంది.
టికెట్ల విక్రయాల రూపంలో వచ్చే ఆదాయం శాతం ఎక్కువే. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్లను తిలకించడానికి విక్రయించే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా ఫ్రాంఛైజీ యాజమాన్యాల పాకెట్లలోకే వెళ్తుంది. ఇందులో బీసీసీఐకి గానీ, క్రికెటర్లకు గానీ దక్కే ఆదాయం నామమాత్రంగా ఉంటుందంతే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వంటి టైటిల్స్ కింద క్రికెటర్లకు లభించే ప్రైజ్ మనీ కూడా ఆయా స్పాన్సరర్లే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఐపీఎల్ టైటిల్ గెలిచిన తరువాత విజేతకు ప్రైజ్మనీ రూపంలో అందించే మొత్తం కూడా ఫ్రాంఛైజీలకే చెందుతుంది. దానితోపాటు మర్చంటైజ్డ్ సేల్స్.. అంటే తమ టీమ్ లోగోను ముద్రించిన టోపీలు, టీ షర్టులు వంటి విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం ఫ్రాంఛైజీలకు వెళ్తుంది. స్టేడియాల ఆవరణలో స్టాళ్లను నెలకొల్పడానికి అద్దె ప్రాతిపదికన స్థలాన్ని కేటాయిస్తుంటారు. అద్దె రూపంలో వచ్చే రాబడి సైతం ఫ్రాంఛైజీలకే దక్కుతుంది.