ముంబై: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ మళ్లీ పాత పాటే పాడుతోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లల్లో నాలుగింట్లో ఓడింది. వరుసగా మూడు మ్యాచ్లల్లో విజయఢంకా మోగించిన తరువాత గెలుపుబాట పట్టినట్టే కనిపించినప్పటికీ.. ఆ వెంటనే వరుసగా రెండింట్లో ఓడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఏడో స్థానానికి పరిమితమైంది ప్రస్తుతానికి.
అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియంలో సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్పై జరిగిన మ్యాచ్లో భారీ తేడాతో పరాజయాన్ని చవి చూసింది ముంబై ఇండియన్స్. ఏకంగా 55 పరుగుల తేడాతో మట్టి కరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్లను మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేయగా.. ముంబై ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్లను నష్టపోయి 152 పరుగుల వద్ద చతికిలపడింది.

కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఈ మ్యాచ్లో కేప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలం అయ్యాడు. ఎనిమిది బంతులను ఎదుర్కొన్న ఈ డాషింగ్ ఓపెనర్ రెండు పరుగులే చేశాడు. తన కౌంటర్పార్ట్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అతనికే క్యాచ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిడిల్ అండ్ లెగ్ స్టంప్స్ మీద పడ్డ ఫుల్ లెంగ్త్ బంతిని లెగ్ సైడ్ ఆడబోయిన రోహిత్ శర్మ టైమింగ్ మిస్ అయ్యాడు.
బ్యాట్ ఎడ్జ్ను తీసుకుని గాల్లోకి లేచిన బంతిని అలవోకగా అందుకున్నాడు పాండ్యా. మరోసారి తక్కువ పరుగులకే వెనుదిరిగాడు రోహిత్. ప్రత్యేకించి- అతను అవుట్ అయిన తీరు ఆందోళనకు గురి చేస్తోంది. రోహిత్ ఆడిన చెత్త షాట్లల్లో అదీ ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒకే ఒక్కసారి భారీ స్కోర్ చేశాడు రోహిత్. 65 పరుగులు చేశాడు. మళ్లీ అలాంటి ఇన్నింగ్ ఆడలేదు.

దీనిపై టీమిండియా మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విశ్రాంతి తీసుకోవాలని రోహిత్ శర్మకు సూచించాడు. గుజరాత్ టైటాన్స్పై అతను అవుట్ అయిన తీరు తనను ఆందోళనకు గురి చేసిందని, ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ల నుంచి బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించిందని పేర్కొన్నాడు. మళ్లీ ఈ సీజన్ చివర్లో అతను ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చినా పర్లేదని, విశ్రాంతి మాత్రం తప్పనిసరి అని చెప్పాడు.
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను ఆడాల్సి ఉందని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్ కోసం తనను తాను సన్నద్ధం చేసుకోవడానికి రోహిత్కు బ్రేక్ తప్పదని వ్యాఖ్యానించాడు గవాస్కర్. అతని వైఫల్యం ప్రభావం డబ్ల్యూటీసీ ఫైనల్పై పడకూడదని కోరుకుంటున్నానని చెప్పాడు. అది జట్టు జయాపజయాలను ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించాడు.