క్రికెట్ పండుగ ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ వేడుకల కోసం అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ నిర్వహించనున్నారు. శుక్రవారం నాడు ఇదే స్టేడియంలో ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది.
ఈ మ్యాచ్ కన్నా ముందుగానే సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా మెరవనుంది. అంతేకాదు, డ్రోన్ల సాయంతో ఆకాశంలో ఐపీఎల్ ట్రోఫీ చిత్రం కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు అందరూ కూడా ఈ వేడుకల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు చెప్తున్నారు. చాలా మంది ఈ ఓపెనింగ్ వేడుకలు చూసేందుకు స్టేడియం వెళ్లాలని అనుకుంటున్నారు.

రెండేళ్ల తర్వాత ఐపీఎల్ మళ్లీ హోం, ఎవే ఫార్మాట్లో జరుగుతోంది. కరోనా కారణంగా 2019 తర్వాత ఈ ఫార్మాట్లో మ్యాచులు జరగలేదు. యూఏఈలో కొన్ని మ్యాచులు జరగ్గా.. గతేడాది కేవలం ఎంపిక చేసిన రెండు, మూడు వేదికల్లోనే సీజన్ అంతా జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఆయా జట్లన్నీ తమ తమ హోం స్టేడియాలకు చేరడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. చెన్నై, ఆర్సీబీ తదితర జట్లు కూడా సొంత స్టేడియాల్లో ప్రాక్టీస్ సెషన్లు చూసేందుకు అభిమానులను కూడా అనుమతించాయి.
ఈ ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు మెరుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ ఐపీఎల్ మ్యాచులు స్టార్ స్పోర్ట్స్తోపాటు జియో సినిమాలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ రెండు సంస్థలు కూడా తమ కామెంటరీ ప్యానెల్ వివరాలు కూడా ఇటీవలే ప్రకటించాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ ఐపీఎల్ ఇటీవలి కాలంలో జరిగిన లీగ్ గణాంకాలు తిరగరాస్తుందని అనిపిస్తోంది. మరి ఈ ఆరంభ వేడుకలు ఎలా జరుగుతాయో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది.