ఈ ఐపీఎల్లో అందరూ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్న ప్లేయర్లలో అర్జున్ టెండూల్కర్ ఒకడు. చాలా కాలంగా ముంబై ఇండియన్స్ క్యాంప్లో ఉన్న అతను.. ఇటీవలే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తొలి రెండు మ్యాచుల్లో ఫర్వాలేదనిపించిన అతను.. మూడో మ్యాచ్లో భారీగా పరుగులిచ్చాడు. అయినా అతన్ని తర్వాతి మ్యాచ్లో ఆడించడంపై కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.
ఈ విమర్శలపై మాజీ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'అర్జున్ టెండూల్కర్ వంటి కుర్రాళ్లు ఒక్క చెత్త ప్రదర్శన చేశారని పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు. అతను చక్కగా బౌలింగ్ చేశాడు. ప్రస్తుతానికైతే అర్జున్ డెత్ బౌలర్ కాదు. ఈ విషయం రోహిత్కు కూడా తెలుసునని అనుకుంటున్నా. చివరి నాలుగైదు ఓవర్లలో అర్జున్ బౌలింగ్ చేయకపోవడమే మంచిది' అని సూచించాడు.

కానీ రోహిత్ ఈ విషయంలో బోల్డ్ నిర్ణయం తీసుకున్నాడని, అర్జున్ చేత డెత్ ఓవర్ వేయించాడని డౌల్ చెప్పాడు. ఈ ప్రయోగం బెడిసి కొట్టిందన్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ బౌలింగ్ను కూడా మెచ్చుకున్న అతను.. అర్జున్ బౌలింగ్ చూస్తే ఒక విధంగా ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ బౌలింగ్లా ఉందన్నాడు. వీళ్లిద్దరూ కూడా పవర్ప్లేలో రెండు ఓవర్లు వేసే బౌలర్లే కావడం గమనార్హం.
అదే సమయంలో డెత్ ఓవర్లు వేసే అనుభవం కూడా అర్జున్కు లేదన్నాడు. 'ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్లా పవర్ప్లేలో అద్భుతంగా బౌలింగ్ వేసే రకం అర్జున్ అని అనుకుంటున్నా. కొంచెం స్వింగ్ లభిస్తున్నా వీళ్లు రెండు, మూడు ఓవర్లు వెంట వెంటనే వేసేస్తారు. ఆ తర్వాత దాని గురించి మనం మర్చిపోతాం. అర్జున్ కూడా అంతే. ప్రస్తుతానికైతే డెత్ ఓవర్లు వేసే అనుభవం అతనికి ఏమాత్రం లేదు' అని డౌల్ అభిప్రాయపడ్డాడు.